Omicron India: ఒమిక్రాన్​ గుబులు- భారత్​లో దాని తీవ్రత ఎంతంటే?

author img

By

Published : Dec 2, 2021, 8:22 PM IST

Updated : Dec 2, 2021, 8:39 PM IST

omicron cases in india

Omicron India: ఒమిక్రాన్​.. కరోనా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తున్న వేరియంట్​. ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిన ఈ కరోనా రకం.. భారత్​లోకి కూడా ప్రవేశించింది. మరి.. ఈ కొవిడ్​ వేరియంట్​ లక్షణాలేంటి? వ్యాధి తీవ్రత ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (B.1.1.529) ప్రజల్లో​ ఆందోళన కలిగిస్తోంది. 2021 నవంబర్​ 24న సౌతాఫ్రికాలో తొలుత ఈ తరహా కేసు బయటపడింది. వెంటనే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది అక్కడి ప్రభుత్వం.

2 రోజులకే దీనిని ఆందోళనకర వైరస్ వేరియంట్​గా ​(వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​) ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. క్రమక్రమంగా ఆఫ్రికా దేశాలు సహా మొత్తంగా ఇప్పటివరకు 29 దేశాలను చుట్టేసిందీ వైరస్​. అమెరికాలో తొలి కేసు డిసెంబర్​ 1న నమోదైంది. తాజాగా భారత్​కూ వ్యాపించింది.

Omicron Cases in India:

భారత్​లో ఎన్ని కేసులు? ఎక్కడ?

భారత్​లో 2 ఒమిక్రాన్​ కేసులు గుర్తించినట్లు డిసెంబర్​ 2న(గురువారం) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నవంబర్​ 11, 20 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో 46, 66 ఏళ్ల వయసు వారిలో ఈ వైరస్​ బయటపడిందని స్పష్టం చేసింది. రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్థుడని, మరొక వ్యక్తి ప్రభుత్వ వైద్యుడని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణాఫ్రియా వ్యక్తికి 66 ఏళ్లుకాగా, కర్ణాటక ప్రభుత్వ వైద్యుడికి 46 ఏళ్లు. దక్షిణాఫ్రికా దేశస్థుడు కోలుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. మంత్రితో సమావేశమై కొత్త వేరియంట్‌ వ్యాప్తి కట్టడిపై చర్చించారు

Omicron Virus Symptoms:

లక్షణాలు ఎలా ఉన్నాయి?

భారత్​లో వెలుగుచూసిన ఒమిక్రాన్​ కేసుల్లో.. తీవ్ర లక్షణాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్ వెల్లడించారు.

వైరస్​ నిర్ధరణ అయిన ఇద్దరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించినట్లు ​ చెప్పారు.

లక్షణాలు లేకుంటే కూడా భయపడాల్సిందేనా?

ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల్లో పెద్దగా లక్షణాలు కనిపించట్లేదు. ఇది భయపడాల్సిన అంశమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధరణ పరీక్షలకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు.

తమకు కొవిడ్‌ సోకిందనే విషయాన్నే కొందరు గుర్తించలేరు. డెల్టా రకంలో కనిపించినట్లు.. కొన్ని వేరియంట్ల వల్ల రోగి శరీరంలో వైరస్‌ అధికస్థాయిలో ఉండొచ్చు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నుంచి అంత అధికంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి రకాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు.

Omicron Dangerous than Delta:

డెల్టా కంటే ప్రమాదకరమా?

భారత్​లో కరోనా రెండో దశకు కారణమైన డెల్టా కంటే ఒమిక్రాన్​ ప్రమాదకరమైనది ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని లవ్​ అగర్వాల్​ స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​ తీవ్రత ఎలా?

కొవిడ్​-19కు కారణమయ్యే సార్స్​-కోవ్​-2 రకాల్లో అత్యధిక మ్యుటేషన్లు ఒమిక్రాన్​లో ఉన్నట్లు తేలింది.

ఒమిక్రాన్​లో మొత్తంగా 50కిపైగా ఉత్పరివర్తనాలు ఉన్నాయి. కేవలం స్పైక్​ ప్రొటీన్​లోనే 32 మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఇది డెల్టా కంటే కూడా ఎక్కువే.

ఇన్ని మ్యుటేషన్లు ఉన్నప్పుడు.. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Omicron Vaccine Efficacy:

టీకాలు పనిచేస్తున్నాయా?

డెల్టా స్ట్రెయిన్ సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు అత్యంత ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోంది?

కేసులు వచ్చినప్పటికీ భయాందోళనకు గురికావొద్దని, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్​ ప్రమాదఘంటికలు మోగినప్పటినుంచే.. భారత్​ అప్రమత్తమైంది. దేశంలో కరోనా నిబంధనలను డిసెంబర్​ 31 వరకు పొడిగించింది.

  • కొత్త వేరియంట్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని నవంబర్​ 28నే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ.
  • నవంబర్​ 30న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ భేటీ.

టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని, కొవిడ్​ నమూనాలను వేగంగా ల్యాబ్​లకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

వైరస్​ కట్టడికి ప్రజలు.. నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని తెలిపారు.

ఒమిక్రాన్​ నేపథ్యంలో.. అంతర్జాతీయ విమానాలను డిసెంబర్​ 15 నుంచి పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ.

మనమేం చేయాలి?

  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
  • ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమికూడొద్దు.
  • అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోవాలి.
  • కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇతరుల్లో అవగాహన కల్పించాలి.
  • విదేశాల నుంచి ప్రయాణికులు టెస్టులు చేయించుకొని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్​లో ఉండాలి.

నిపుణులు ఏమంటున్నారు?

భారతీయులకు ముప్పు తక్కువే!

ఒమిక్రాన్​ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొందరు ఆరోగ్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఒమిక్రాన్​ సహా ఇతర కరోనా వేరియంట్ల నుంచి రక్షణ పొందారని, పెద్దగా ఆందోళన అవసరం లేదని అన్నారు ఇన్సాకాగ్​ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైరాలజిస్ట్​ డాక్టర్​ షాహిద్​ జమీల్​.

బూస్టర్​తో చెక్​!

బూస్టర్ డోసుతో ఒమిక్రాన్​ను అడ్డుకోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టీ జేకబ్ జాన్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఇన్ఫెక్షన్ రావడం సహజమేనని అన్నారు.

డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ ఏమన్నారంటే?

ఒమిక్రాన్​ వేరియంట్​ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న ఆ సంస్థ చీఫ్​ టెడ్రోస్​ అధనోమ్​.. వైరస్​ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.

ప్రపంచ దేశాల్లో..

దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్​లో 16 కేసులు వెలుగుచూశాయి. హాంకాంగ్​, ఇజ్రాయిల్​, బెల్జియం, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్​, స్పెయిన్​, యూఏఈ, అమెరికాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో ఒమిక్రాన్​ తొలి కేసు.. కాలిఫోర్నియాలో డిసెంబర్​ 1న నమోదైంది.

ఒమిక్రాన్​ను చూసి అమెరికా ప్రజలు కంగారు పడొద్దని భరోసా కల్పించారు అధ్యక్షుడు జో బైడెన్​. ఈ వేరియంట్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

కట్టడి సాధ్యమే..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కొవిడ్​ వెలుగుచూసినప్పటి పరిస్థితులు వస్తున్నట్లు తెలుస్తోంది. 547 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​​ కేసులు చేరాయి. 55 రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 20 వేల లోపే నమోదవుతుండటం శుభపరిణామం.

Vaccination in India:

125 కోట్ల డోసుల పంపిణీ..

భారత్​లో ఇప్పటివరకు 125 కోట్ల డోసులకు పైగా టీకా పంపిణీ చేసింది కేంద్రం.

వయోజనుల్లో 84 శాతం మంది వ్యాక్సిన్​ మొదటి డోసు, 49 శాతం రెండు డోసులు పొందారు. ప్రస్తుతానికి టీకానే వైరస్​ నుంచి కాపాడుతుందని, అర్హులైన వారంతా కచ్చితంగా వ్యాక్సిన్​ తీసుకోవాలని ప్రజలను అర్థించారు నీతిఆయోగ్​ సభ్యులు వీకే పాల్​.

ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టి.. టెస్టులు, వ్యాక్సినేషన్​ను వేగవంతం చేస్తే, ఒమిక్రాన్​ను కూడా వీలైనంత త్వరగా కట్టడి చేయగలగొచ్చు.

ఇవీ చూడండి: Omicron India: ఒమిక్రాన్​ భయాలు- ఆఫ్రికా నుంచి వచ్చిన 100 మంది అదృశ్యం!

government focus on new variant: ఒమిక్రాన్​పై ప్రభుత్వం అప్రమత్తం.. వారికి పరీక్షలు తప్పనిసరి

Covid Endemic Phase: ఒమిక్రాన్​ ఎంట్రీతో.. ముగిసిన మహమ్మారి దశ!

Last Updated :Dec 2, 2021, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.