అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు- 26 దేశాలకు వ్యాపించిన వైరస్!

author img

By

Published : Dec 2, 2021, 6:23 AM IST

omicron variant

omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో బుధవారం తొలిసారి ఈ రకం వైరస్ వెలుగుచూసింది.

omicron variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. 23 దేశాల్లో వెలుగుచూసినట్లు నిర్ధరణ అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ పరిణామాన్ని డబ్ల్యూహెచ్​ఓ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. టెడ్రోస్ ఈ ప్రకటన చేసిన అనంతరం అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. కాలిఫోర్నియాలోని ఓ వ్యక్తిలో దీనిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈలోనూ ఒమిక్రాన్ తొలి కేసులు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య 26కు పెరిగినట్లు అవుతుంది!

"ఒమిక్రాన్ విస్తరణను డబ్ల్యూహెచ్​ఓ తీవ్రంగా పరిగణిస్తోంది. అన్ని దేశాలు కూడా అలాగే భావించాలి. వైరస్​ చేసే పనే వేగంగా విస్తరించడం. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది."

- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్

ఒమిక్రాన్​పై లోతైన అధ్యయనం జరుగుతోందని టెడ్రోస్ వెల్లడించారు. ఈ వేరియంట్​.. తీవ్రత, దానిపై టీకాల ప్రభావం వంటివాటిని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకు ఈ కేసులు తొలుత వెలుగుచూసిన ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని మంగళవారం టెడ్రోస్ తప్పుబట్టారు.

దక్షిణ కొరియాలో ఐదు..

దక్షిణ కొరియాలో తొలిసారిగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నైజీరియా నుంచి ఆ దేశానికి వచ్చిన వారిలో ఈ వైరస్ వెలుగుచూసినట్లు తెలుస్తోంది. దీంతో దేశ సరిహద్దుల్లో ఆంక్షలను కఠినతరం చేశారు.

ఆంక్షల సడలింపు వారికే..

ఫ్రెంచ్, యూరప్ పౌరులను దక్షిణాఫ్రికా నుంచి తిరిగి రప్పించేందుకు ఫ్రాన్స్​ ప్రభుత్వం విమానాలను అనుమతించనుందని ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇంటికి తిరిగి వచ్చే దౌత్య అధికారులు లేదా ఎయిర్​లైన్స్​ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. వృత్తి రీత్యా, కుటుంబ అవసరాల కోసం, పర్యాటకానికి దక్షిణాఫ్రికా వెళ్లినవారికి అనుమతి లేదు.

ఘనాలోనూ..

నవంబర్ 21న తమ దేశంలోకి వచ్చినవారిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు ఘనా బుధవారం తెలిపింది. ఘనా దేశస్థుల్లో ఈ వేరియంట్ లేదని వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 200 మంది ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల్లో 28 శాతం మందిలో ఈ వైరస్​ను గుర్తించినట్లు చెప్పింది.

టీకా తప్పనిసరి!

కరోనా కొత్త వేరియంట్ల ముప్పు నేపథ్యంలో ఐరోపా సమాఖ్య దేశాల్లో టీకా తీసుకోవడం తప్పనిసరి చేయడాన్ని పరిశీలించాలని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్​డెర్​ లియోన్ అన్నారు. ఇప్పటికీ మూడో వంతు ఐరోపా టీకా తీసుకోలేదని, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అక్టోబర్​లోనే 'ఒమిక్రాన్​' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.