ETV Bharat / bharat

'కేంద్రం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం'.. రైల్వే మంత్రి రాజీనామాకు విపక్షాల డిమాండ్

author img

By

Published : Jun 3, 2023, 5:12 PM IST

ఒడిశా రైలు ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ రాజీనామా చేయాలని ఆర్​జేడీ డిమాండ్​ చేసింది.

tejaswi yadav slams modi govt
RJD DEMANDS railway minister's resign

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దుర్ఘటనకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విరుచుకుపడ్డాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.

KAVACHలోనూ కుంభకోణం జరిగింది: ఆర్​జేడీ
ఆటోమేటిక్​ ట్రైన్​ ప్రొటెక్షన్​ సిస్టమ్​ 'కవచ్​'లో కూడా కుంభకోణం దాగి ఉందని ఆర్​జేడీ ట్విట్టర్​ వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

"మోదీ ప్రభుత్వం కేవలం వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లలోనే ప్రజలు ప్రయాణించాలని ఆశిస్తోంది. ఇది సిగ్గు చేటు. రైల్వే మంత్రికి కాస్త నైతికత, ఆత్మ గౌరవం ఉంటే ఇన్ని కుటుంబాలను నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి."
- ఆర్​జేడీ

బిహార్​ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్​ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాదం తనను మానసికంగా తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'కవచ్' వ్యవస్థ విఫలం కావడం కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆయన ఆరోపించారు.

చాలా ప్రశ్నలు ఉన్నాయ్​!
కాంగ్రెస్​ పార్టీ ఒడిశా రైలు దుర్ఘటనపై ​విభిన్నంగా స్పందించింది. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీని, రైల్వే మంత్రిని నిలదీయడానికి మా వద్ద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. కానీ ప్రస్తుతం బాధితులను రక్షించడానికి, వారికి సహాయం అందించడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపింది. కాంగ్రెస్​ పార్టీ నాయకులు కూడా బాధితులకు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన చేశారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ డిమాండ్​ చేశారు. భవిష్యత్​లో ఇలాంటి దుర్ఘటనలు మరలా సంభవించకుండా ఒడిశా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సిగ్నలింగ్​ వ్యవస్థ వైఫల్యమే కారణం:
ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్​ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధరించింది. లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్​ రైలును మెయిన్​ లైన్​పై వెళ్లాల్సిన కోరమాండల్​ పొరపాటున ఢీకొట్టిందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఒడిశా రైలు ప్రమాదంలో సుమారు 278 మంది మరణించగా, దాదాపుగా 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

మోదీ పర్యటన :
ఘటన తీవ్రత దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఒడిశాలో పర్యటించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారిని అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.