అక్కడ రాళ్లు రువ్వితే ఉద్యోగమివ్వరు!

author img

By

Published : Aug 2, 2021, 6:48 AM IST

jammu
రాళ్లు రువ్వితే ఉద్యోగమివ్వరు! ()

నిరసనల పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తూ.. రాళ్లు రువ్వేవారిపట్ల జమ్ముకశ్మీర్​ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దని పోలీసు విభాగం ఆదేశాలు జారీచేసింది. అంతేగాక పాస్‌పోర్టులూ రాకుండా చూడాలని స్పష్టం చేసింది.

రాళ్లు రువ్వినా, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొన్నా.. అలాంటివారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి వారికి పాస్‌పోర్ట్‌లు కూడా జారీ చేయకూడదని పేర్కొంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వారు ఇకపై విదేశాలకు వెళ్లే అవకాశమే ఉండదని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ వ్యక్తికైనా.. పాస్‌పోర్టు జారీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రం పరిశీలించే సమయంలో తప్పని సరిగా ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. రాళ్లు రువ్వడం, దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నారా? లేదా? అన్న విషయాలపై ధ్రువీకరణ సమయంలో అధ్యయనం చేయాలని సీఐడీ స్పెషల్‌ బ్రాంచ్‌.. పోలీసు అధికారులకు సూచించింది. సీసీ టీవీల ఫుటేజీలనూ పరిశీలించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌ రికార్డుల్లోనూ దీన్ని ధ్రువీకరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ-కశ్మీర్‌ పోలీసుల నిర్ణయాన్ని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా స్వాగతించారు. ఇది గొప్ప అడుగు అని.. దేశ వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదన్నారు.

jammu
రాళ్లు రువ్వితే ఉద్యోగమివ్వరు!

పాక్‌ వెళ్లి.. ఉగ్రవాదులుగా మారి..

విద్యాభ్యాసం కోసం సరైన పత్రాలు సమర్పించి పాకిస్థాన్‌ వెళ్తున్న కశ్మీర్‌ యువత భారత్‌ తిరిగొచ్చే క్రమంలో ఉగ్రవాదులుగా మారుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన షాకీర్‌ అల్తాఫ్‌ భట్‌ కూడా పాకిస్థాన్‌ వెళ్లి వచ్చినట్లు తెలిపారు. చదువుల కోసమని సరైన పత్రాలు సమర్పించి 2018లో అల్తాఫ్‌ భట్‌ పాకిస్థాన్‌ వెళ్లాడని పేర్కొన్నారు. అనంతరం ఉగ్రవాదిగా మారినట్లు అధికారులు తెలిపారు. 2015-2019 మధ్య కాలంలో జారీ చేసిన పాస్‌పోర్టులను పరిశీలించగా దాదాపు 40 మంది విద్యార్థులు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వెళ్లారని తేలిందని.. వీరిలో 28 మంది వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు తేలిందని వెల్లడించారు. తక్కువ వ్యవధిలో చెల్లుబాటయ్యే వీసాలతో గత మూడేళ్లలో పాకిస్థాన్‌ వెళ్లిన దాదాపు 100 మంది కశ్మీర్‌ యువకులు మళ్లీ తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. వీరంతా భారత సరిహద్దులో పనిచేస్తున్న వివిధ ఉగ్ర సంస్థల్లో చేరి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.