ETV Bharat / bharat

నితిన్​ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ.10కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ..

author img

By

Published : Mar 21, 2023, 6:00 PM IST

nitin gadkari got death threat calls nagpur office
nitin gadkari got death threat calls nagpur office

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్​ నాయకుడు నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు బెదిరింపు కాల్స్​ చేయడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు.. నాగ్​పుర్​లోని గడ్కరీ ఇల్లు, కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ. 10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. మంగళవారం మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి ఓ వ్యక్తి మూడు సార్లు కాల్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. గడ్కరీ కార్యాలయ సిబ్బంది సమాచారంతో అలర్ట్​ అయిన పోలీసులు.. ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బెదిరింపు కాల్స్​ చేసిన వ్యక్తి తనను తాను జయేశ్ పుజారిగా చెప్పుకున్నాడని నాగ్​పుర్​ రెండో జోన్​ డిప్యూటీ సీపీ రాహు మాడనే వెల్లడించారు. మంగళవారం ఉదయం రెండు సార్లు.. మధ్యాహ్నం ఒకసారి ఫోన్​ చేసి రూ. 10 కోట్లు డిమాండ్​ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. ఆ కాల్స్​ చేసిన వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి చేస్తున్నాడో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కాల్​ వచ్చిన నంబర్​ను మంగళూరులోని ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. అయితే, ఈ కాల్​ ఆ మహిళే చేసిందా?.. లేదా జయేశ్​ పూజారి అనే వ్యక్తి చేశాడా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జయేశ్​ పూజారి.. ఓ మర్డర్​ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని తెలిసింది. దీనిపై అతడిని విచారించగా, తనకూ.. ఈ బెదిరింపు కాల్స్​కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
నితిన్​ గడ్కరీకి జనవరి 14న కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయి. తాను జయేశ్​ పూజారినని.. రూ. 100 కోట్లు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని దుండగుడు బెదిరించాడు. తాను దావూద్​ ఇబ్రహీం గ్యాంగ్​ సభ్యుడినని చెప్పుకున్నాడు. మంగళవారం సాయంత్రం నితిన్ గడ్కరీ నాగ్​పుర్​ రానున్న నేపథ్యంలో మరోసారి ఇదే తరహా కాల్స్ రావడం​ కలకలం రేపింది.

పుట్టిన రోజే చంపేస్తామంటూ..
ఇలాంటి హైప్రొఫైల్​ రాజకీయ నాయకులకు డెత్​ త్రెట్​ కాల్స్​ రావడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది డిసెంబర్​లో ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్​ పవార్​ పుట్టిన రోజున ఆయనను చంపేస్తామంటూ.. కొందరు దుండగులు బెదిరింపు కాల్స్​ చేశారు. శరద్​ పవార్​కు అంతకుముందు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆ నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.