ETV Bharat / bharat

'ఆ 40 రోజులు కీలకం'.. కరోనాపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.. మాస్కులపై క్లారిటీ

author img

By

Published : Dec 28, 2022, 5:20 PM IST

india covid update mandaviya
india covid update mandaviya

జనవరి నెలలో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది! కరోనా ఉద్ధృతి విషయంలో వచ్చే 40 రోజులు కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని కేంద్రం తెలిపింది. అయితే, మాస్కులు తప్పనిసరి కాదని పేర్కొంది.

భారత్​లో కరోనా ఉద్ధృతి విషయంలో వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జనవరిలో కరోనా కేసులు గరిష్ఠస్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కరోనా వేవ్ సంభవించినప్పటికీ.. మరణాలు, ఆస్పత్రుల్లో చేరికలు చాలా తక్కువగా ఉంటాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. "తూర్పు ఆసియాలో కరోనా వేవ్ వచ్చిన 30-35 రోజుల తర్వాత భారత్​లో కొవిడ్ వేవ్ సంభవిస్తోంది. గత పరిణామాలను బట్టి ఇది ఓ ట్రెండ్​గా కొనసాగుతోంది" అని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు, చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నట్లు సమాచారం. ఆర్​టీపీసీఆర్ పరీక్షలతో పాటు ఎయిర్ సువిధ పోర్టల్​లో వివరాలు నింపడం కూడా తప్పనిసరి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, థాయ్​లాండ్, సింగపూర్, హాంకాంగ్ దేశాల ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు వెల్లడించాయి. కాగా, గురువారం కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ దిల్లీ ఎయిర్​పోర్ట్​ను సందర్శించనున్నారని, పరీక్షల తీరును, స్క్రీనింగ్ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలిస్తారని అధికారులు చెప్పారు.

కాగా, అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్​గా పరీక్షలు కొనసాగుతున్నట్లు మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో 6వేల మందిని పరీక్షించగా.. 39 మందికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. తమిళనాడులో ఓ మహిళ, తన ఆరేళ్ల కుమార్తె కొవిడ్ బారిన పడ్డట్టు తేలిందని అధికారులు తెలిపారు. కొలంబో మీదుగా చైనా నుంచి మదురైకి ఆమె ప్రయాణించారని చెప్పారు. రానున్న 30 రోజులు జాగ్రత్తగా ఉండటం అత్యంత కీలకమని వివరించారు. వ్యాక్సిన్లపై బీఎఫ్.7 వేరియంట్​ చూపుతున్న ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన మాండవీయ.. మాస్కులు తప్పనిసరేం కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో కరోనా కేసులు పెరగొచ్చన్న సంకేతాలు కనిపిస్తుండటం గమనార్హం. యాత్రను నిలిపివేయాలని ఇప్పటికే మాండవీయ.. రాహుల్ గాంధీని కోరారు. లేదంటే కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. జనవరి 3న తిరిగి యాత్ర ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.