ETV Bharat / bharat

నెహ్రూ కంటే ముందే.. భారత ప్రధానిగా 'బోస్'​​ ప్రమాణం!

author img

By

Published : Oct 21, 2021, 9:01 AM IST

భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రమాణం చేయటానికి నాలుగేళ్ల ముందే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆ పని చేశారు. 1943లో సరిగ్గా ఇదే రోజు (అక్టోబరు 21) నేతాజీ సారథ్యంలో సింగపూర్‌ వేదికగా భారత తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. వారి చేతిలో ఉన్న భారత భూభాగం.. అండమాన్‌ నికోబార్‌ దీవి మాత్రమే!

subash chandra bose
భారత ప్రధానిగా సుభాష్​ చంద్రబోస్​!

రెండో ప్రపంచయుద్ధం చివరి రోజులనాటికి భారత్‌ స్వాతంత్య్ర సమరం నాటకీయంగా మారసాగింది. జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌ల మధ్య పోరు ప్రభావం భారత్‌పై పడుతున్న దశ అది. భారత్‌లో బ్రిటిష్‌వారి చెర నుంచి తప్పించుకుని వెళ్లిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జపాన్‌, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్‌ను విముక్తం చేయాలని భావించారు. ఆ క్రమంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (ఐఎన్‌ఏ)ను ఏర్పాటు చేశారు. బర్మా, సింగపూర్‌లాంటి చోట్ల ఓడిపోయి జపాన్‌ చేతికి చిక్కిన బ్రిటన్‌ సైన్యంలోని భారతీయ సిపాయిలు బోస్‌ సైన్యంలో చేరారు. వీరికి జపాన్‌, బర్మా, మలేసియా తదితర దేశాల్లోని భారతీయులు కూడా తోడయ్యారు. బలూచిస్థాన్‌ నుంచి మొదలెట్టి... దక్షిణభారతం దాకా అన్ని ప్రాంతాలవారితో సుమారు 50వేల మందితో ఐఎన్‌ఏ ఓ భారత సమాహారంగా రూపుదిద్దుకుంది. ఝాన్సీ పేరిట ఏర్పాటైన రెజిమెంట్‌లో భారీసంఖ్యలో మహిళలు కూడా చేరటం విశేషం.

సింగపూర్‌ను జపాన్‌ గెల్చుకోవటం వల్ల బోస్‌ కార్యకలాపాలకు ఆ దేశం వేదికైంది. జపాన్‌ ప్రభుత్వ మద్దతుతో 1943 అక్టోబరు 21న నేతాజీ సింగపూర్‌ కాథీ థియేటర్‌లో ఆర్జి హుకూమత్‌ ఎ ఆజాద్‌ హింద్‌ (స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం)ను ఏర్పాటు చేశారు. బోస్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా.. లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఏసీ ఛటర్జీ ఆర్థికమంత్రిగా, లక్ష్మీస్వామినాథన్‌ మహిళా వ్యవహారాల మంత్రిగా ప్రమాణం చేశారు. గాంధీజీ చర్ఖా గల త్రివర్ణ పతాకాన్ని తమ పతాకంగా ప్రకటించారు. సబ్‌ సుఖ్‌ చయన్‌ (జనగణమనకు ఉర్దూ అనువాదం) జాతీయగీతంగా, జైహింద్‌ను నినాదంగా నిర్ణయించారు. తొలితరం విప్లవవాది రాస్‌ బిహారీ బోస్‌ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. భారత్‌ను బ్రిటన్‌ నుంచి విముక్తం చేయటానికి విదేశీగడ్డపై ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వమిది. అండమాన్‌ నికోబార్‌ దీవులపై తప్పిస్తే భారత్‌లోని ఏ ప్రాంతంపైనా దీనికి అధికారం లేదు. అండమాన్‌ నికోబార్‌ను బ్రిటన్‌ నుంచి జపాన్‌ గెల్చుకొని.. నేతాజీకి అప్పగించింది. పేరుకు నేతాజీ ప్రభుత్వమే అయినా పెత్తనమంతా జపాన్‌ సైన్యాలదే!

ప్రభుత్వ ఏర్పాటు తరువాత నేతాజీ.. చలో దిల్లీ అంటూ పిలుపునిచ్చారు. భారత్‌లోని బ్రిటన్‌ ప్రభుత్వంపై ఇండో-బర్మా సరిహద్దుల్లో యుద్ధం ప్రకటించారు. ఇంఫాల్‌-కోహిమా సెక్టార్‌లో కూడా జపాన్‌ సేనలతో కలసి ఐఎన్‌ఏ పోరాడింది. కొన్ని విజయాలు.. కొన్ని వెనకడుగులతో సాగిన ఐఎన్‌ఏ యాత్ర తన లక్ష్యాన్ని నేరుగా సాధించకున్నా.. పరోక్షంగా బ్రిటన్‌ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తమపక్షాన పోరాడుతున్న భారత సైనికులను నమ్మలేని పరిస్థితి కల్పించింది. ఎక్కడ తిరుగుబాటు తలెత్తుతుందోననే ఆందోళన వారిలో రోజురోజుకు ఎక్కువైంది. భారత్‌ను ఇక ఎక్కువరోజు పాలించలేమనే భావన బ్రిటన్‌ మదిలో బలంగా నాటడంలో ఐఎన్‌ఏ సఫలమైంది.

"కష్టాల్లో, సుఖాల్లో; చీకటిలో వెలుతురులో; గెలుపులో ఓటమిలో.. మీ వెంటుంటా! ప్రస్తుతానికి నేను మీకేమీ ఇవ్వలేకున్నా.. నాతో పాటు కలిసి నడిస్తే.. తప్పకుండా స్వేచ్ఛనిస్తా! తాత్కాలికమే అయినా.. ఇది ప్రతి ఒక్క భారతీయుడి ప్రభుత్వం. ప్రజలందరికీ సమానమైన హక్కులు, అవకాశాలతో పాటు మతపరమైన స్వేచ్ఛకు ఈ ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం పాటించిన కుళ్లు, కుతంత్రాల విభజిత పాలన కాకుండా ప్రజలందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది"

- సుభాష్‌ చంద్రబోస్‌

ఇదీ చూడండి : అంటరాని గాంధీజీ.. మహాత్ముడికీ తప్పలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.