ETV Bharat / bharat

ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు.. ట్విట్టర్​లో ఆ వీడియో పెట్టడమే కారణం

author img

By

Published : Feb 10, 2023, 6:08 PM IST

Updated : Feb 10, 2023, 7:30 PM IST

mp suspended from parliament
mp suspended from parliament

కాంగ్రెస్​కు చెందిన రాజ్యసభ సభ్యురాలు రజనీ అశోక్​రావ్​ పాటిల్​పై సస్పెన్షన్​ వేటు పడింది. బడ్జెట్​ సమావేశాల తొలి సెషన్​ వరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఎగువసభ ఛైర్మన్ జగధీప్​ ధన్​ఖడ్ ప్రకటించారు.

రాజ్యసభ కార్యకలాపాల్ని సెల్​ఫోన్​లో చిత్రీకరించి, సోషల్​ మీడియాలో పోస్ట్ చేసిన ఎంపీపై సస్పెన్షన్​ వేటు పడింది. కాంగ్రెస్​ సభ్యురాలు రజనీ అశోక్​రావ్​ పాటిల్​పై ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ ఛైర్మన్​ జగధీప్​ ధన్​ఖడ్​ శుక్రవారం ప్రకటించారు. బడ్జెట్​ సమావేశాల ప్రస్తుత సెషన్ ముగిసేవరకు ఆమె సభకు రాకూడదని స్పష్టం చేశారు.
గురువారం రాజ్యసభకు సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్​లో చక్కర్లు కొట్టిన విషయాన్ని సభాపక్ష నేత పీయూష్ గోయల్​ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రస్తావించారు. సభ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్​ను కోరారు.

"ప్రతిపక్ష నాయకులు స్పష్టంగా కనిపించకపోయినా.. ఇలా పార్లమెంట్​లో అనధికారికంగా వీడియో తీయడం మంచిది కాదు. దీనిపై ఇప్పటికే పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కోరుతున్నాను. ఇలా చేయడాన్ని సభా ఉల్లంఘనగా భావిస్తున్నాను. వీడియో తీసిన సభ్యులు ఎవరైనా సరే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను."

--పీయూష్ గోయల్​, సభాపక్ష నేత

కాంగ్రెస్​ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు ప్రతిపాదించగా.. విచారణ పూర్తైన తర్వాతే చర్య తీసుకోవాలని కోరింది కాంగ్రెస్​. ఎంపీని సస్పెండ్​ చేయాలంటూ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సహా పలువురు భాజపా ఎంపీలు డిమాండ్ చేశారు. వీరి అభ్యర్థనపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్.. సస్పెన్షన్​పై ప్రకటన చేశారు."సభా కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ట్విట్టర్​లో పోస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా పరిగణించాను. అవసరమైన చర్యలన్నీ చేపట్టాను. సభ పవిత్రతను కాపాడేందుకు.. బయటి సంస్థల సాయాన్ని ఈ విషయంలో కోరలేం. అందుకే ఈ ఉదయం సభలోని సీనియర్ సభ్యులతో మాట్లాడాను. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఈ మొత్తం వ్యవహారంపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఏం చర్యలు తీసుకోవాలో ఆ కమిటీ చేసే సిఫార్సులను ఈ సభ ఆమోదించేవరకు.. రజనీ అశోక్​రావ్​ పాటిల్​ను సస్పెండ్ చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల ప్రస్తుత సెషన్​కు ఈ సస్పెన్షన్​ వర్తిస్తుంది" అని స్పష్టం చేశారు రాజ్యసభ ఛైర్మన్.

'మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకే సస్పెండ్​'
బడ్జెట్​ సమావేశాల నుంచి సస్పెన్షన్​కు గురికావడంపై ఎంపీ రజనీ అశోక్​రావ్​ పాటిల్​ స్పందించారు. "నేను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చాను. చట్టాలను అతిక్రమించే సంస్కృతి నాకు లేదు. మేము ప్రధాని మోదీ ప్రసంగాన్ని పదేపదే అడ్డుకున్నాం. అందుకే వారు విసిగిపోయి ఈ పని చేశారు. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగింది." అని ఆమె చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. తొలి సెషన్​ ఫిబ్రవరి 13 వరకు సాగనుంది. తిరిగి మార్చి 13న మొదలై ఏప్రిల్​ 6న పూర్తి కానుంది.

ఇవీ చదవండి; అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

బరువు పెరగాలని అండర్​వేర్​లో రాళ్లు.. ఫిట్​నెస్​ టెస్ట్ పాస్ కోసం అడ్డదారులు

Last Updated :Feb 10, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.