ETV Bharat / bharat

విమానంలో వివాహంపై డీజీసీఐ ఫైర్- వారిపై కేసు!

author img

By

Published : May 24, 2021, 7:57 PM IST

ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్‌, దక్షిణకు కొత్త సమస్య వచ్చిపడింది. పెళ్లి ఆనందం ముగియక ముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి నెలకొంది. విమానంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. వధూవరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది.

Mid-air wedding in SpiceJet chartered flight violating COVID norms
వినువీధిలో వివాహమాడిన వధూవరులకు కొత్త చిక్కు

తమిళనాడు మధురైలో కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా విమానంలో పెళ్లి చేసుకున్న ఘటనపై పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై విచారణ చేపట్టి, విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా స్పైస్‌ జెట్‌కు షోకాజ్ నోటిసులు జారీ చేసింది. పెళ్లి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు మధురై ఎస్పీ సుజిత్‌ కుమార్‌ తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

తమిళనాడు మధురైకి చెందిన రాకేశ్‌, దీక్షణ ఆదివారం ఉదయం స్పైస్‌ జెట్‌ విమానాన్ని అద్దెకు తీసుకుని ఆ విమానంలోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి తంతు మొత్తం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అది కాస్త వైరల్‌గా మారింది. కర్ఫ్యూ కారణంగా 50మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యేందుకు అనుమతి ఉండగా... ఈ పెళ్లికి 161 మంది హాజరయ్యారు. వచ్చిన వారు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

పెళ్లి కోసం వినియోగించిన బోయింగ్ 737 విమానాన్ని ఆదివారం ఓ ట్రావెల్ ఏజెంట్‌ ద్వారా పెళ్లి కుటుంబం అద్దెకు తీసుకున్నట్లు స్పైస్ జెట్‌ వివరణ ఇచ్చింది. చార్టర్డ్ విమానంలో అనుసరించాల్సిన కొవిడ్ మార్గదర్శకాలపై వారికి స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రయాణంలో ఉండగా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ముందే వారికి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి- 'కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​ఓ అనుమతులు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.