ETV Bharat / bharat

తిరిగి NCP గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ.. శరద్ పవార్ పక్కా స్కెచ్!

author img

By

Published : Jul 4, 2023, 12:24 PM IST

maharashtra-political-crisis-two-mlas-including-mp-return-in-ncp-from-ajit-pawar-group
శరద్​ పవార్ గూటికి తిరిగొచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ

Maharashtra Politics Update : అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్​ చెంతకు చేరారు. సోమవారం శరద్​ పవార్​ కారులో వీరిద్దరు​ ప్రత్యక్షమయ్యారు. మరోవైపు, మహారాష్ట్రలో ఎన్​సీపీ కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్​ పవార్​ సిద్ధమయ్యారు.

Maharashtra Political Crisis : పార్టీలో సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్​సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ వైపు ఆకర్షితులు కాకుండా శాసనసభ్యులను శరద్ పవార్ తనవైపు తిప్పుకుంటున్నారు. ఆదివారం అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్​ చెంతకు చేరారు. సోమవారం ఆయన కారులో వీరిద్దరు​ ప్రత్యక్షమయ్యారు. మకరంద్ పాటిల్​, బాలాసాహెబ్ పాటిల్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి వచ్చారు. షిరూర్ ఎంపీ అమోల్ కోల్హే సైతం తాను శరద్​ పవార్ వెంటే ఉంటానని ప్రకటించారు. మకరంద్ పాటిల్​.. సతారా జిల్లాలోని వాయీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. బాలాసాహెబ్ పాటిల్ నార్త్ కరాడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

సోమవారం గురు పూర్ణిమ సందర్భంగా తన గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ స్మారక చిహ్నానికి నివాళులు అర్పించేందుకు శరద్​ పవార్ వెళ్లగా.. ఆయనతో పాటు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పయనమయ్యారు. వీరిని తిరిగి తీసుకురావడంలో శరద్​ పవార్​ రాత్రికే రాత్రే వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

వాయీ నియోజకవర్గం ఎన్​సీపీకి మంచి పట్టున్న స్థానం. ఈ స్థానం నుంచి ఎన్​సీపీ అభ్యర్థులు చాలా సార్లు ఎన్నికయ్యారు. మకరంద్ పాటిల్​ తాత దివంగత లక్ష్మణ్ పాటిల్​, శరద్​ పవార్​లు మంచి మిత్రులుగా ఉండేవారు. లక్ష్మణ్​రావు పాటిల్​ సతారా జిల్లా ఎన్​సీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన ఎంపీగానూ.. వాయీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు.

అజిత్​ పవార్​ కొత్త పార్టీ కార్యాలయం..
Ajit Pawar NCP : మరోవైపు, మహారాష్ట్రలో ఎన్​సీపీ కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్​ పవార్​ సన్నాహాలు చేస్తున్నారు. ముంబయిలోని మంత్రాలయ ప్రాంత సమీపంలో పార్టీ ఆఫీస్​ను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అజిత్​ పవార్​ కొత్త పార్టీ ఆఫీస్​ ప్రారంభించే నిర్ణయంపై ఎన్​సీపీ శరద్​ పవార్ వర్గం నేత క్లైడ్ క్రాస్టో తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఎన్​సీపీ పార్టీ నియమావళి ప్రకారం.. ఇలాంటివి చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ప్రఫుల్ పటేల్​, అజిత్​ పవార్​ పరిపక్వత కలిగిన నాయకులన్న క్లైడ్ క్రాస్టో.. నియమ నిబంధనలు తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తే ఏం మాట్లాడగలమని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పీకర్​ కీలక వ్యాఖ్యలు
Maharashtra Speaker Rahul Narwekar : ఎన్​సీపీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉందా లేదంటే బీజేపీ-శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందా అనే విషయాన్ని తానింకా నిర్ధరించుకోలేదన్నారు మహారాష్ట్ర స్పీకర్​ రాహుర్​ నర్వేకర్​. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ చీలికపై తనకింకా ఎటువంటి పిటిషన్ అందలేదన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్​ మాత్రమే అందిందన్నారు. ఈ మొత్తం అంశంపై స్పష్టత వచ్చిన తరువాత ముందుకెళతానని నర్వేకర్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.