ETV Bharat / bharat

'మహా' కేబినెట్ విస్తరణ.. 18 మందికి ఛాన్స్.. శివసేన నుంచి 9 మంది..

author img

By

Published : Aug 9, 2022, 11:22 AM IST

Updated : Aug 9, 2022, 12:36 PM IST

మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే తన కేబినెట్​ను విస్తరించారు. 18 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. భాజపా, శివసేన నుంచి తొమ్మిది మంది చొప్పున మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

MAHARASHTRA CABINET EXPANSION
MAHARASHTRA CABINET EXPANSION

MAHARASHTRA CABINET EXPANSION: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో 18 మందికి చోటు లభించింది. 9 మంది భాజపా ఎమ్మెల్యేలు, మరో 9 మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా మంగళవారం ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో మహారాష్ట్ర మంత్రివర్గం బలం 20కి చేరింది. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 43 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుత కేబినెట్​లో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.

గవర్నర్ బీఎస్​ కోశ్యారీ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. 15 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణస్వీకారం జరిగింది. భాజపా నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా సుధీర్ ముంగటివార్, గిరిష్ మహాజన్, సురేశ్ ఖాడె, రాధాకృష్ణ విఖె పాటిల్, రవీంద్ర చవాన్, మంగల్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సావె మంత్రి పదవి దక్కించుకున్నారు. శివసేన వర్గం నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసార్కర్, గులాబ్​రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్​​ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

రాష్ట్రంలో భాజపా- శివసేన(శిందే వర్గం) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇద్దరు వ్యక్తులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ ఏక్​నాథ్ శిందే, ఫడణవీస్ లక్ష్యంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు చర్యలు తీసుకుంది. త్వరలో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని శిందే సన్నిహితులు తెలిపారు. అందుకే ఇప్పుడు సహాయ మంత్రులను తీసుకోలేదని చెప్పారు.

ఇదీ చదవండి:

Last Updated :Aug 9, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.