'శివుడు కంఠంలో  విషాన్ని దాచుకున్నట్లు మోదీ ఆ బాధను భరించారు'

author img

By

Published : Jun 25, 2022, 11:17 AM IST

Updated : Jun 25, 2022, 11:57 AM IST

amit shah news
అమిత్​ షా ()

Amit shah on gujarat riots 2002: గుజరాత్​ అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అన్నారు. మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు.

Amit shah on gujarat riots 2002: పరమ శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. గుజరాత్‌ అల్లర్లపై ఏఎన్‌ఐ ఇంటర్య్వూలో మాట్లాడిన మంత్రి అమిత్‌షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేశాయని ఆరోపించారు. ఆ బాధను ప్రధాని మోడీ భరిస్తుండటం తాను దగ్గరగా చూశానని అన్నారు. గుజరాత్‌ అల్లర్లలో మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. సిట్‌ విచారణను తాము ప్రభావితం చేయలేదని.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఈ కేసు భాజపా ప్రతిష్ఠను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడదంతా తొలగిపోయిందన్నారు.

"తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు ఒక్క మాట మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారు. ఆ వేదనను నేను ఎంతో దగ్గరగా చూశాను. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం"

-అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

అలాగే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత ఈడీ విచారణకు హాజరవుతోన్న తీరును తీవ్రంగా నిరసించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరవుతోన్న ఆయనకు మద్దతుగా కేంద్రంపై కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలుపుతున్నారు. 'సిట్ ముందు హాజరయ్యేప్పుడు మోదీ ఎలాంటి హడావుడి చేయలేదు. విచారణను నిరసిస్తూ ధర్నా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు పిలుపు ఇవ్వలేదు. ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నా విచారణకు సహకరించారు. ఆ అల్లర్ల సమయంలో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. కానీ దిల్లీలో చాలామంది సిక్కులను చంపివేశారు. కానీ ఒక్క అరెస్టు చేయలేదు. మేము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని వారు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు. నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఆ ఆరోపణలన్నీ రాజకీయపూరితమైనవని కోర్టు కూడా చెప్పింది' అని తెలిపారు.

ఇదీ జరిగింది..: 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ పలు కోర్టులను ఆశ్రయించారు.

మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇదీ చదవండి: 'మహా' రాజకీయ సంక్షోభంలో సయోధ్యకు దారేది?

Last Updated :Jun 25, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.