'మహా' రాజకీయ సంక్షోభంలో సయోధ్యకు దారేది?

author img

By

Published : Jun 25, 2022, 5:23 AM IST

Maharashtra political crisis

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీపై తిరుగుబావుట ఎగరవేసిన ఏక్​నాథ్​ శిందే.. అసలైన శివసేన తమదేనని పేర్కొన్నారు. మరోవైపు.. మహా వికాస్​ అఘాడీని వీడాలన్న అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్​ను తోసిపుచ్చారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. పార్టీని పునఃనిర్మించుకుంటామన్నారు. దీంతో సయోధ్యకు దారి కనిపించే పరిస్థితులు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) సర్కారులో ప్రధాన భాగస్వామి శివసేన పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడంలేదు. తిరుగుబాటు వర్గం నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటుండగా...మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాజీ యత్నాల్లో భాగంగా శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ చేసిన ప్రతిపాదనకు శిందే వర్గం స్పందించక పోగా...వేచి చూసే ధోరణినే కొనసాగిస్తోంది. తన మద్దతుదారుల్లోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రయత్నాలపై శిందే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన శివసేన తమదేనని, పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తన వెంటే ఉన్నారని, అనర్హత పేరుతో భయపెట్టలేరని మండిపడ్డారు. తామే ప్రత్యర్థి వర్గంపై చర్యలు తీసుకుంటామన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గువాహటి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకున్నట్లు సమాచారం. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసమ్మతి వర్గ నేత శిందే ఓ వార్త సంస్థకు స్వయంగా వెల్లడించారు.

Maharashtra political crisis
.

సభలో నెగ్గుతాం: సంజయ్‌ రౌత్‌
క్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో తమకు మద్దతిచ్చే పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతోందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో అంగీకరించారు. అయితే, శాసనసభలో జరిగే బల పరీక్షలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే రెబల్స్‌ ఓటేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయికి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ విధేయతకు సంబంధించిన నిజమైన పరీక్షను వారు ఎదుర్కొంటారన్నారు.

Maharashtra political crisis
.

మా వెనుకుంది బాల్‌ఠాక్రేనే: శిందే
లమైన జాతీయ పార్టీ మద్దతిస్తోందని గురువారం గువాహటిలో తన వర్గం ఎమ్మెల్యేలకు తెలిపిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే శుక్రవారం మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమను సంప్రదించలేదని తెలిపారు. భాజపా అండగా నిలుస్తోందా అని ఓ టీవీ ఛానెల్‌ విలేకరి ప్రశ్నించగా ..‘ఒక పెద్ద శక్తి మా వెనుకుంది అంటే...అది బాలా సాహెబ్‌ ఠాక్రే, ఆనంద్‌ డిఘేనే’ అని సమాధానమిచ్చారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపునకు సంబంధించి మాట్లాడుతూ...స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. ‘55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది నా వెంట గువాహటికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, సంఖ్యా బలమే ముఖ్యం. మాపై చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు’ అని..డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు శివసేన చీఫ్‌విప్‌ రాసిన లేఖపై స్పందించారు. గురువారం ముంబయిలో శిందే కార్యాలయం విడుదల చేసిన వీడియోలో..‘మనం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మీ వెంటే మేం ఉన్నామని తెలిపింద’ని ఏక్‌నాథ్‌ గువాహటి హోటల్లో తన మద్దతుదారులతో చెబుతున్నట్లుగా ఉంది.

వీడింది అధికార నివాసాన్నే.. ధైర్యాన్ని కాదు:ఠాక్రే
పార్టీ ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయానని స్పష్టమైన పరిస్థితుల్లో...క్షేత్ర స్థాయిలో శ్రేణుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రారంభించారు. దాదర్‌లోని శివసేన భవన్‌లో సమావేశమైన పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో వర్చువల్‌ విధానంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మనుగడ సాగించగలదనే భరోసా కల్పించే యత్నం చేశారు.

" నేను వీడింది అధికార నివాస భవనాన్నే...ధైర్యాన్ని కాదు. గతంలోనూ శివసేనలో తిరుగుబాట్లు వచ్చాయి. అయినా పార్టీ దృఢంగా నిలబడి మళ్లీ అధికారంలోకి వచ్చింది. నా అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థులు లబ్ధిపొందాలని చూస్తున్నారు. నీ(తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ఉద్దేశించి) తనయుడు శ్రీకాంత్‌ శిందే ఎంపీ కావచ్చు. మరి నా కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయంగా ఎదిగితే తప్పేంటి? తిరుగుబాటు వెనుక భాజపా నేతలున్నారు. ఎంవీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారు. ప్రతి సీజన్‌లో వృక్షాలకు కొత్త ఆకులు, పువ్వులు, కాయలు వస్తాయి. తెగుళ్లు సోకితే మధ్యలోనే రాలి పోతాయి. వేళ్లు బలంగా ఉంటే చెట్టు ఎప్పటికీ కూలదు"

- ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

భాజపాతో మళ్లీ పొత్తు కుదుర్చుకోవాలన్న శిందే వర్గం డిమాండ్‌ను నిర్ద్వందంగా తోసిపుచ్చారు ఠాక్రే. భాజపా నేతలు శివసేనను ఉపయోగించుకుని అవతలకు విసిరేసిన విషయాన్ని మర్చిపోయారా? అని నిలదీశారు. 'ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కొత్త శివసేనను నిర్మిద్దాం. తిరుగుబాటు వర్గం వల్లే మీకు ఉపయోగం ఉంటుందని అనుకుంటే మీరూ వెళ్లొచ్చు. నేను ఆపను. రెబెల్‌ ఎమ్మెల్యేలు గువాహటిలో బందీలుగా ఉన్నారు. వాళ్లని వెనక్కి ఎలా తీసుకురావాలో చూడాల్సి ఉంది' అని పార్టీ శ్రేణులతో అన్నారు. తన నాయకత్వంపై విశ్వాసం లేకుంటే పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగేందుకు సిద్ధమేనని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదన్నారు. గత రెండేళ్లుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదే అదనుగా తిరుగుబాటుదారులు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం శివసేన జాతీయ కార్యవర్గం ముంబయిలో భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత మాతోశ్రీకి వచ్చి ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించుకున్నారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పవార్​ను బెదిరిస్తారా?'

'మహారాష్ట్రలో శివసేన లేకుండా చేయాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.