ETV Bharat / bharat

ర్యాగింగ్‌పై సినీఫక్కీలో 'పోలీస్‌ పంచ్'.. 'మెడికల్​ స్టూడెంట్'​లా లేడీ పోలీస్​ గెటప్​

author img

By

Published : Dec 12, 2022, 6:25 PM IST

వైద్య కళాశాలలో ర్యాగింగ్ కేసును పోలీసులు పక్కా స్కెచ్‌తో ఛేదించారు. మారువేషాల్లో కాలేజ్​లోకి ప్రవేశించి నిందితులను పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే?

ragging case in Indore medical college
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

ఓ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ కేసును పోలీసులు సినీఫక్కీలో ఛేదించారు. మారువేషాల్లో కాలేజీలోకి ప్రవేశించిన ఖాకీలు ర్యాగింగ్‌ చేస్తున్న ఆకతాయిల పనిపట్టారు. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌ ఇందోర్‌లోని ఓ వైద్య కళాశాలలో వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..
మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌పై ఓ విద్యార్థి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కళాశాల అధికారులు కూడా జులై 24న కొందరు గుర్తు తెలియని విద్యార్థులపై క్రిమినల్‌ కేసు పెట్టారు. యూజీసీ హెల్ప్‌లైన్‌కు చేసిన ఫిర్యాదులో ర్యాగింగ్‌ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొన్నప్పటికీ.. నిందితులు, ఫిర్యాదుదారు పేర్లులేవని సన్యోగితాగంజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి తెహ్జీబ్‌ కాజీ తెలిపారు. అలాగే, ఈ ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌లో ఉన్నా.. ఎంతమంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం లేదని వివరించారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు పోలీసు బృందాన్ని రంగంలోకి దించినట్టు ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా 24 ఏళ్ల మహిళా పోలీస్‌ అధికారిని వైద్య విద్యార్థిని వేషంలో కాలేజీకి పంపించి అసలు అక్కడేం జరుగుతుందో నిఘా వేశారు. ఈ కేసును ఛేదించేందుకు కాలేజీ విద్యార్థినిగా ఒకరు, నర్సుగా మరొక పోలీస్‌ను పంపారు. వీరితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను కాలేజీ క్యాంటీన్‌ వర్కర్లుగా పంపినట్టు తెహ్బీజ్‌ కాజీ వివరించారు. ఈ పోలీస్‌ బృందం కాలేజీలో ర్యాగింగ్‌ భూతాన్ని ధ్రువీకరించేలా సమగ్ర దర్యాప్తుతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న 11మంది విద్యార్థులను గుర్తించింది. సీనియర్‌ విద్యార్థులు తమ జూనియర్లను కొన్ని అసభ్యకరమైన చర్యలకు పాల్పడేలా ర్యాగింగ్‌ చేశారని పోలీసులు తెలిపారు. దీంతో సీఆర్‌పీసీలో సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. నిందితుల జాబితాను కాలేజీ యంత్రాంగానికి అప్పగించగా.. 11మంది విద్యార్థులపై మూడు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేశారని తెలిపారు.

హల్ద్వానీ వైద్య కళాశాలలో 44మందిపై కఠిన చర్యలు..
ఉత్తరాఖండ్‌.. హల్ద్వానీలో ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. డిసెంబర్‌ 9న జరిగిన ర్యాగింగ్‌ ఘటనలో 44మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్టు కళాశాల ప్రిన్సిపల్‌ అరుణ్‌ జోషి తెలిపారు. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని చెప్పారు.

ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో ఒక విద్యార్థిని హాస్టల్‌ నుంచి బహిష్కరించి రూ.50వేలు జరిమానా విధించగా.. మిగతా 43 మందికి రూ.25 వేలు చొప్పున జరిమానా విధించినట్లు వివరించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్లు పిలిచి దూషించడం, హాస్టల్‌ గదికి కూడా పిలించి దాడి చేసినట్లు ఓ వీడియోలో రికార్డయింది. దీనిపై దర్యాప్తు చేసిన యాంటీ ర్యాగింగ్‌ కమిటీ 44 మంది విద్యార్థులను ఈ ఘటనలో దోషులుగా తేల్చింది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్టు ప్రిన్సిపల్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.