ETV Bharat / bharat

Mahatma Gandhi: మహాత్ముడు మెచ్చిన రాజమండ్రి 'రత్నం'

author img

By

Published : Aug 20, 2021, 7:05 AM IST

'మన వస్తువులను మనమే తయారు చేయాలి' అని గాంధీజీ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో.. 1935లో కె.వి.రత్నం రంగంలోకి దిగారు. కష్టమైనా పట్టుదలతో స్వదేశంలో రూ.5వేల పెట్టుబడితో తొలి పెన్నుల పరిశ్రమ ఆరంభించారు. రత్నం పరిశ్రమలో తయారైన పెన్నును చూసి ముచ్చటపడ్డ మహాత్ముడు.. ఆయనను మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు.

kv ratnam
కేవీ రత్నం, రత్నం పెన్ను

'విదేశీ పెన్నులకు దీటైంది రాజమండ్రి రత్నం పెన్ను!'

తన పిలుపుతో ఆరంభమైన తొలి జాతీయ లఘుపరిశ్రమకు జాతిపిత మహాత్మాగాంధీ ఇచ్చిన కితాబిది! విదేశీ వస్తువులను బహిష్కరించిన నేపథ్యంలో సామాన్య ప్రజలు రోజూ వినియోగించే వస్తువులను మనమే తయారు చేయాలని గాంధీ పిలుపునిచ్చారు. దానికి స్పందించి.. దేశంలో ఆరంభమైన తొలి లఘు పరిశ్రమ మన రాజమండ్రి రత్నం పెన్నుల పరిశ్రమ! అప్పటి దాకా పెన్నుల పరిశ్రమ విదేశాలకే పరిమితమైంది. గాంధీజీ పిలుపు స్ఫూర్తితో.. 1935లో కె.వి.రత్నం రంగంలోకి దిగారు. కష్టమైనా పట్టుదలతో స్వదేశంలో రూ.5వేల పెట్టుబడితో తొలి పెన్నుల పరిశ్రమ ఆరంభించారు.

శిక్షణనివ్వటానికి నిరాకరించినా..

బంగారు, వెండి పాళీలుగల వాటితో పాటు సామాన్యులు రాసే సిరా పెన్నులు, ఆ తర్వాత కాలంలో బాల్‌ పెన్నులు కూడా కె.వి.రత్నం తయారు చేశారు. అప్పటికే రాజమండ్రి(రాజమహేంద్రవరం)లో బంగారు వ్యాపారం చేసే రత్నం.. పెన్నుల పరిశ్రమ అభివృద్ధి కోసం విదేశాల్లో పరిశీలించి, శిక్షణ పొందేందుకు ప్రయత్నించారు. కానీ జాత్యహంకారంతో విదేశీ కంపెనీలు శిక్షణ ఇవ్వటానికి నిరాకరించాయి. అయినా పట్టువీడని ఆయన స్వయంగా మెలకువలను అధ్యయనం చేసి విజయం సాధించారు. సామాన్యులతో పాటు సంస్థానాధీశులు, మహారాజులు కూడా రత్నం పెన్నులంటే మక్కువ చూపేవారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలన్నా, అధికారులకు పదోన్నతి లభించాలన్నా... ఏదైనా శుభం జరగాలన్నా... రత్నం పెన్నుతో రాయాలనే సెంటిమెంట్‌ ప్రబలింది.

వార్ధా నుంచి ఉత్తరం..

రత్నం పెన్ను గాంధీకి కూడా చేరింది. దాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డ గాంధీజీ... రత్నం సేవలను అభినందిస్తూ వార్ధా నుంచి ఉత్తరం రాశారు. తర్వాత రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు కూడా ఈ పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిల్చిపోగా... రాజమండ్రిలో మాత్రం రత్నం కుమారుడు వెంకటరమణ మూర్తి, మనవలు గోపాలరత్నం, చంద్రశేఖర్‌ ఇంకా నడుపుతున్నారు. ప్రభుత్వాల నుంచి ఏమాత్రం సాయం లేకున్నా పెన్నులు ఇంకా తయారు చేస్తున్నారు. 2019లో జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆమెకు రాజమండ్రి రత్నం పెన్నును తెప్పించి బహూకరించారు. శుభకార్యాల్లో కూడా రత్నం పెన్నులివ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా... గాంధీజీ రాజమండ్రిలో కె.వి.రత్నం సన్‌ సంస్థ రూపంలో ఇంకా బతికే ఉన్నారు! "మా అబ్బాయిల సహకారంతో... నాన్నగారి స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉంది" అంటారు వెంకటరమణ మూర్తి!

"మా తాతగారి కాలం నాటి యంత్రాల మీదే ఇప్పటికీ సిరా పెన్నులు తయారు చేస్తున్నాం. ఈ నైపుణ్యం ఇతరులకు నేర్పటానికి సిద్దంగా ఉన్నా... నేర్చుకోవటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు."

గోపాలరత్నం (కె.వి.రత్నం మనవడు)

ఇదీ చూడండి: జాతీయోద్యమ రణ స్ఫూర్తే.. అమృతోత్సవ శుభసంకల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.