ETV Bharat / bharat

మంత్రి రాజీనామా.. రాజ్యాంగంపై ఆ వ్యాఖ్యలే కారణం

author img

By

Published : Jul 6, 2022, 6:12 PM IST

Updated : Jul 6, 2022, 6:20 PM IST

saji cheriyan controversy
saji cheriyan controversy

Saji cheriyan controversy: రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి సాజి చెరియన్.. పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని అనడం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Saji cheriyan controversy: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యకార​, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్రంలోని విపక్షాలు చెరియన్​ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేయగా.. ఆయన తలొగ్గాల్సి వచ్చింది.

"నేను రాజీనామా చేశాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నేను ఎప్పుడూ రాజ్యాంగాన్ని కించపరచ లేదు. నా ప్రసంగంలోని ఓ భాగాన్ని తీసుకుని, వక్రీకరించారు. సీపీఎంను, ఎల్​డీఎఫ్​ను బలహీనపరిచేందుకే ఇలా చేశారు" అని బుధవారం రాజీనామా అనంతరం ఓ ప్రకటనలో పేర్కొన్నారు చెరియన్.

చెరియన్ ఏమన్నారు?: మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమానికి హాజరైన చెరియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని చెరియన్ విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని చెరియన్​ స్పష్టం చేశారు.

"మనం రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించుకున్నామని చెప్పుకుంటాం. ఇది భారత దేశానికే ప్రత్యేకమైనదని చెబుతాం. కానీ ఈ రాజ్యాంగాన్ని అత్యధిక ప్రజలను దోచుకునే విధంగా రాశారు."
- సాజి చెరియన్​, కేరళ మంత్రి

చెరియన్​ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్​, భాజపా మంగళవారం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆయన్ను వెంటనే కేబినెట్​​ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది.
విచారం వ్యక్తం చేసిన చెరియన్: తాను ప్రజా సేవకుడినని.. రాజ్యాంగాన్ని తానెంతో గౌరవిస్తానని మంగళవారం చెప్పారు సాజి చెరియన్. రాజ్యాంగాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే.. సాజి చెరియన్​ను బర్తరఫ్​ చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్​ను అధికార సీపీఎం తోసిపుచ్చింది. పొరపాటున నోరు జారారని వ్యాఖ్యానించింది. చివరకు అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో.. చెరియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: 'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్​సెన్స్​' జోస్యం!

Last Updated :Jul 6, 2022, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.