ETV Bharat / bharat

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 30 కేజీల ఐఈడీ సీజ్.. పంద్రాగస్టున దాడికి ప్లాన్!

author img

By

Published : Aug 10, 2022, 9:44 AM IST

kashmir-30-kg-ied-recovered
kashmir-30-kg-ied-recovered

Jammu Kashmir IED: జమ్ము కశ్మీర్​లో భారీ ఉగ్రకుట్రను బలగాలు భగ్నం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 30 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు, కశ్మీర్​లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్ ప్రారంభమైంది. ముగ్గురు ముష్కరులను బలగాలు చుట్టుముట్టాయి.

IED recovered in Pulwama: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జమ్ము కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పుల్వామాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. దీంతో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది.
"పుల్వామా పోలీసులు, భద్రతా దళాలకు ఐఈడీ రవాణా గురించి పక్కా సమాచారం అందింది. తహాబ్ క్రాసింగ్ వద్ద 25 నుంచి 30 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నాం" అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.

రైల్వే స్టేషన్లలో నిఘా...
కాగా, కశ్మీర్​లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఉధంపుర్-కాట్రా రైల్వే లింక్ వద్ద భారీగా బలగాలు మోహరించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి.

kashmir-30-kg-ied-recovered
రైల్వే స్టేషన్​లో తనిఖీలు
kashmir-30-kg-ied-recovered
డాగ్ స్క్వాడ్

చిక్కిన ముగ్గురు ముష్కరులు!
మరోవైపు, బుద్గాంలో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్ ప్రారంభమైంది. వాటర్​హిల్ ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తొయిబా ముఠాకు చెందినవారిగా భావిస్తున్న వీరిని బలగాలు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముష్కరుల్లో లతీఫ్ రాథర్ సైతం ఉన్నాడని, కశ్మీర్​లో రాహుల్ భట్, అమ్రీన్ భట్ సహా పలువురు పౌరులను చంపిన ఘటనల్లో అతడు కీలక నిందితుడని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్​తో లింకులు ఉన్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్​లోని ముబారక్​నగర్​ నుంచి నిందితుడు సాబుద్దీన్​ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఐఈడీ బాంబుదాడి చేసేందుకు నిందితుడు కుట్రపన్నాడని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.