ETV Bharat / bharat

'భారత్​లో ఫేస్​బుక్​ను నిలిపివేస్తాం'.. కర్ణాటక హైకోర్టు వార్నింగ్

author img

By

Published : Jun 15, 2023, 1:30 PM IST

Karnakata High Court Warns Facebook
ఫేస్​బుక్​ను హెచ్చరించిన కర్ణాటక హైకోర్టు

Karnakata High Court Warns Facebook : ఓ కేసు విచారణలో పోలీసులకు సహకరించని ఫేస్​బుక్​కు కర్ణాటక హైకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. అడిగిన సమాచారం ఇవ్వకపోతే భారత్​లో ఆ సంస్థ సేవల్ని నిలిపివేస్తామని తేల్చిచెప్పింది.

Karnakata High Court Warns Facebook : భారత్​లో ఫేస్​బుక్​ సేవలను నిలిపివేస్తామని కర్ణాటక హైకోర్టు.. ఆ సామాజిక మాధ్యమాన్ని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైల్లో ఉన్న భారతీయ వ్యక్తికి సంబంధించిన కేసులో.. స్థానిక పోలీసులకు సహకరించని కారణంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్ణకట్టె ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ క్రిష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఫేస్​బుక్​ను హెచ్చరించింది.

కేసు విచారణకు సహకరిస్తూ.. కావాల్సిన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని ఫేస్​బుక్​ను హైకోర్టు ఆదేశించింది.​ అటు మంగళూరు పోలీసులు కూడా సరైన విచారణ చేపట్టి.. నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.

సౌదీ అరేబియాలో అరెస్టయిన శైలేశ్ కుమార్ భార్య కవిత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. "శైలేశ్​ కుమార్(52) సౌదీ అరేబియాలోని ఓ సంస్థలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పిల్లలతో కలిసి నేను స్వగ్రామంలోనే ఉంటున్నాను. 2019లో శైలేశ్ కుమార్ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్-ఎన్​ఆర్​సీకి అనుకూలంగా ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఎవరో ఆయన పేరుతో ఫేస్​బుక్​లో నకిలీ ఖాతా తెరిచారు. సౌదీ అరేబియా దేశంపై అభ్యంతరకర పోస్టులు చేశారు. ఈ విషయం నా భర్త ద్వారా తెలుసుకున్నాను. వెంటనే నేను మంగళూరు పోలీస్ స్టేషన్​లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాను. కానీ ఇంతలోనే సౌదీ పోలీసులు శైలేశ్​ను అరెస్ట్​ చేసి.. జైల్లో పెట్టారు' అని హైకోర్టులో వేసిన పిటిషన్​లో కవిత పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన మంగళూరు పోలీసులు.. ఫేక్​ అకౌంట్​ గురించి తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్​బుక్​కు లేఖ రాశారు. కానీ పోలీసులకు.. ఫేస్​బుక్ సహకరించలేదు. దీంతో పిటిషనర్ కవిత.. విచారణలో అలసత్వం వహిస్తున్నారంటూ 2021లో హైకోర్టు ఆశ్రయించారు. తన భర్తను జైలు నుంచి విడిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సైతం ఉత్తరం రాసినట్టు కవిత వెల్లడించారు.

ఫేస్​బుక్​ డేటా అక్ర‌మ బ‌దిలీ.. మెటాకు భారీ జరిమానా..
ఇటీవల ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు రికార్డు స్థాయిలో జ‌రిమానా ప‌డింది. ఈయూ యూజ‌ర్లకు చెందిన ఫేస్‌బుక్ డేటాను.. అమెరికాలోని స‌ర్వ‌ర్ల‌కు అక్ర‌మంగా బ‌దిలీ చేసిందని నిర్ధరిస్తూ ఐరోపా సమాఖ్య మెటాకు ఫైన్ విధించింది. ఈ కేసులో 130 కోట్ల డాల‌ర్లు చెల్లించాల‌ని ఆదేశించింది. ఐరిష్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ సోమ‌వారం ఆ జ‌రిమానాకు చెందిన ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఈయూ యూజర్ల డేటాను నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు బదిలీ చేసినట్లు ఆరోపించింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.