జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కుమారుడు.. వివేక్ డోభాల్కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ క్షమాపణలు చెప్పారు. 2019 నాటి పరువు నష్టం కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో క్షమాపణలు కోరారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగాను జైరాం రమేష్, కారవాన్ మ్యాగజైన్పై వివేక్ డోభాల్ 2019లో పరువు నష్టం కేసును నమోదు చేశారు.
"కారవాన్ మ్యాగజైన్లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని వివేక్పై వ్యాఖ్యలు చేశాను. వివేక్, అతని కుటుంబ సభ్యులకు బాధకలిగిస్తే మన్నించండి. ఆ న్యూస్ వెబ్సైట్లో వెలువడిన వార్తలను తొలగించండి."
- జైరాం రమేష్
2019లో జనవరి 17న జరిగిన మీడియా సమావేశంలో వివేక్ డోభాల్, అతని కుటుంబంతో పాటు వ్యాపార సంస్థ జీఎన్ఏ ఆసియా ఫండ్పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపణలు చేశారు. అప్పట్లో సాధారణ ఎన్నికల ముందు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం జైరాం క్షమాపణలను వివేక్ స్వీకరించారు.