తమిళనాడుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్క్వేర్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుపుతోంది. పన్ను ఎగవేత, ఆదాయం లెక్కల్లో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలకు సంబంధించి 50 పైగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా.. డీఎంకే నేత, అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్, ఆయన కుమారుడు కార్తీక్ ఇంటితో సహా కోయంబత్తూర్లోని జీ స్క్వేర్ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ డీఎంకే శ్రేణులు.. ఎమ్మెల్యే మోహన్ ఇంటి ముందు నిరసన చేపట్టాయి.
జీ-స్క్వేర్ సంస్థ తక్కువ ధరలకు ఆస్తులు కొని.. వాటిని అధిక ధరలకు అమ్ముతోందని ఐటీ అధికారులు చెప్పినట్లు సమాచారం. కానీ, వసూలు చేసిన ఎక్కువ మొత్తానికి పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. కంపెనీ డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, దాడులు చేసే సమయంలో ఐటీ శాఖ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి బదులు సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు) సాయం తీసుకున్నారు. జీ స్క్వేర్ కంపెనీపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. పన్ను ఎగవేత ఆరోపణలతో 2019లో కూడా ఐటీ దాడులు జరిగాయి.
అంతకుముందు.. జీ స్క్వేర్ కంపెనీపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కంపెనీని డీఎంకే నేత కుటుంబం నడుపుతోందని.. అందుకే దానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలా లబ్ధి చేకూరినట్లు ఆరోపించారు. అందువల్లనే ఆ సంస్థ అనూహ్య వృద్ధి సాధించిందని.. లేకపోతే అది సాధ్యం కాకపోయేదని అన్నారు.
కర్ణాటకలోనూ...
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు చేపట్టింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గంగాధర్ గౌడకు సంబంధించిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దాంతో పాటు దక్షిణ కన్నడ జిల్లా బేల్థగడిలోని ఓ విద్యా సంస్థలో కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు.
మరోవైపు, లోకాయుక్త సైతం కర్ణాటకలో దాడులు చేపడుతోంది. లెక్కకు మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో బీబీఎంపీ (బృహన్ బెంగళూరు మహానగర పాలిక)లోని అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి గంగాధరయ్య ఇంట్లో దాడులు నిర్వహించింది. నగదు, నగలు తదితర వస్తువులతో పాటు కొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.