మయన్మార్లోని సైనిక తిరుగుబాటు వ్యవహారంపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్, అమెరికాలు అంగీకారించాయి. అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి, అంచనా వేయడానికి ఇరుదేశాలు ఒప్పుకున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఫోన్ సంభాషణ సందర్భంగా మయన్మార్లో జరిగిన పరిణామాలపై చర్చించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. మయన్మార్లో చట్టపాలన, ప్రజాస్వామ్య ప్రక్రియను తప్పక సమర్థించాలని భారత్ విశ్వసిస్తోందని ఆయన అన్నారు. ఆ దేశంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో తాము తీసుకున్న చర్యకు కారణాలను పేర్కొంటూ.. మయన్మార్ మిలిటరీ నుంచి భారత్కు లేఖ వచ్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. మయన్మార్ సైన్యం పలు దేశాలకు ఇలాంటి లేఖలే పంపింది.
ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యం కోసం మాతో చేతులు కలపండి'