ETV Bharat / bharat

అఫ్గాన్ అంశంపై భారత్- ఆస్ట్రేలియా 2+2 చర్చలు!

author img

By

Published : Sep 11, 2021, 4:22 PM IST

ప్రజాస్వామ్య దేశాలుగా ఇరువురి ప్రయోజనాలు శాంతి, సుస్థిరతలతోనే ముడిపడి ఉన్నాయని ఆస్ట్రేలియా మంత్రులతో జరిగిన 2 ప్లస్ 2 చర్చల్లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. 'స్వేచ్ఛాయుత, సమీకృత, సుసంపన్న ఇండో పసిఫిక్' అనే భావనపై ఇరుదేశాల బంధం ఆధారపడి ఉందని చెప్పారు. కొవిడ్​ను ఎదుర్కొనేందుకు భవిష్యత్​లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇండో పసిఫిక్​లో భారత్ శక్తిమంతంగా తయారవుతోందని ఆస్ట్రేలియా మంత్రులు పేర్కొన్నారు.

Rajnath Singh
2+2 చర్చలు

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలిసారి 2 ప్లస్ 2 చర్చలు జరిగాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు కీలక చర్చలు జరిపారు. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకునేందుకు దుందుడుకు విధానాలను అవలంబించడం వంటి పరిస్థితుల మధ్య ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Rajnath Singh
2+2 చర్చల్లో వివిధ దేశాల నేతలు

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరైస్ పైన్​తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. కొవిడ్​ను ఎదుర్కొనేందుకు భవిష్యత్​లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. రక్షణ రంగంలో సహకారం పెంపొందించేందుకు ప్రతిష్ఠాత్మక ఫ్రేమ్​వర్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.


"అత్యంత కీలకమైన సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. కొవిడ్​తో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే విధంగా ఆలోచించే భాగస్వాములతో చర్చించి దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి. అదే సమయంలో.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఉండేలా చర్యలు తీసుకోవాలి. అతి కొద్ది దేశాలతోనే భారత్ 2 ప్లస్ 2 చర్చలు జరుపుతోంది. ఈ రోజు జరిగిన సమావేశాల్లో అఫ్గాన్ పరిణామాలు ప్రధాన చర్చనీయాంశంగా ఉంది."
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

అమెరికాలోని 9/11 దాడులు జరిగి 20 ఏళ్లైన నేపథ్యంలో ఈ విషయంపైనా స్పందించారు జైశంకర్. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తోందని అన్నారు.

Rajnath Singh
2+2 సమావేశంలో రాజ్​నాథ్, జైశంకర్

'దానిపైనే ఇరుదేశాల బంధం'

అఫ్గాన్​లో భద్రతా పరిస్థితులు సహా ఉగ్రవాద కట్టడిపై భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డట్టన్​తో చర్చించారు. అఫ్గాన్ పరిణామాల వల్ల ఇరుదేశాలకు ఎదురయ్యే ముప్పు గురించి సమాలోచనలు జరిపారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఇరువురి ప్రయోజనాలు శాంతి, సుస్థిరతలతోనే ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా కీలకమైన భాగస్వామ్య దేశాలని అన్నారు. 'స్వేచ్ఛాయుత, సమీకృత, సుసంపన్న ఇండో పసిఫిక్,' అనే భావనపై ఇరుదేశాల బంధం ఆధారపడి ఉందని చెప్పారు.


"ఆస్ట్రేలియా మంత్రులతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపాం. రక్షణ రంగంలో సహకారం, కరోనాపై పోరాటం కోసం ఇందుకోసం వ్యవస్థీకృత విధానాల అభివృద్ధి చేయడంపై చర్చించాం. అఫ్గానిస్థాన్ అంశంతో పాటు, ఇండో పసిఫిక్​లో సహకారంపై సమాలోచనలు జరిపాం."
-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఇండో పసిఫిక్​లో భారత్ గొప్ప శక్తిగా ఎదుగుతోందని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ డట్టన్ పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సహకారం అత్యున్నత స్థాయికి చేరిందని చెప్పారు. ఈ సందర్భంగా పరోక్షంగా చైనాకు చురకలు అంటించారు. సముద్ర తీరాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.

మరోవైపు, అఫ్గాన్ మరోసారి ఉగ్రవాదులకు ఆశ్రయం కాకూడదని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మెరైస్ పైన్ పేర్కొన్నారు. అక్కడి నుంచి బయటకు రావాలనుకుంటున్న పౌరులు, విదేశీయులు, వీసా హోల్డర్లను సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్-ఆస్ట్రేలియాకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని అన్నారు.

బంధం ప్రత్యేకం!

భారత్, ఆస్ట్రేలియా ఇప్పటికే క్వాడ్​లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, జపాన్​లతో కలిసి సమన్వయంతో చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి బలోపేతం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో.. సభ్యదేశాలతో వ్యూహాత్మక చర్చలు జరుపుతోంది భారత్.

గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరింది. లాజిస్టిక్స్ అవసరాల కోసం సైనిక స్థావరాలను వినియోగించుకునేలా గతేడాది జూన్​లో ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇదీ చదవండి: '9/11 ఘటన.. మానవాళిపై జరిగిన హేయమైన దాడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.