గెలుపు గుర్రాలు వారే.. గుజరాత్​లో వారసులకే కాంగ్రెస్​, భాజపా టికెట్లు!

author img

By

Published : Nov 21, 2022, 4:51 PM IST

gujarat election 2022

Gujarat Election 2022 : సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. త్వరలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది. వారసుల రాకతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

Gujarat Election 2022 : గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 13 చోట్ల, భాజపా 7 చోట్ల సిట్టింగ్‌ లేదా మాజీ ఎమ్మెల్యేల కుమారులను నిలబెట్టింది. విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు ఇలా వారసులకు టికెట్లు ఇస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు పనిచేస్తూ 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసీ నేత మోహన్‌సిన్హ్‌ రత్వా ఇటీవల హస్తం పార్టీతో బంధం తెంచుకుని భాజపాలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న.. చోటా ఉదయ్‌పుర్‌ స్థానాన్ని భాజపా రత్వా కుమారుడు రాజేందర్‌సిన్హ్‌కు కేటాయించింది. ఇక.., ఇదే స్థానంలో కాంగ్రెస్‌ సంగ్రామ్‌సిన్హ్‌ రత్వాను బరిలోకి దించింది. ఈయన రైల్వే శాఖ మాజీ మంత్రి నరన్‌ రత్వా కుమారుడు. రాజేందర్‌, సంగ్రామ్‌ ఇద్దరికీ రాజకీయ అరంగేట్రం ఇదే కావడం విశేషం.

వారసత్వ రాజకీయాలు లేవంటూనే..
థస్రా శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్‌ మాజీ ఎమ్మెల్యే రామ్‌సిన్హ్‌ పార్మర్‌ కుమారుడు. రామ్‌సిన్హ్‌ గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత.. ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్‌ వాఘేలా గత నెల మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

తాజా ఎన్నికల్లో ఆయన బయద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన మహేంద్ర సింగ్‌ ఆ మధ్య భాజపాలో చేరారు. ఇటీవల కాషాయ పార్టీని వీడి మళ్లీ.. హస్తం పార్టీలో చేరారు. మరో మాజీ ముఖ్యమంత్రి అమర్‌సిన్హ్‌ చౌదరీ కుమారుడు తుషార్‌ చౌదరీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బర్దౌలీ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.

వారసులే గెలుపు గుర్రాలు..
గుజరాత్‌కు చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు విట్టల్‌ రాదదియా కుమారుడు జయేశ్‌ రాదాదియాకు భాజపా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. 2017లో ఎన్నికల్లో జెట్‌పుర్‌ నుంచి భాజపా తరపున గెలిచిన జయేశ్.. ప్రస్తుతం విజయ్‌ రూపాని కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి : మరో 'శ్రద్ధా వాకర్' హత్య.. ప్రేయసి శవాన్ని ముక్కలు చేసి బావిలో పడేసి..

రెచ్చిపోయిన దొంగలు రోడ్డుపై వెళ్తున్న బైకర్లను వెంబడించి లూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.