మరో 'శ్రద్ధా వాకర్' హత్య.. ప్రేయసి శవాన్ని ముక్కలు చేసి బావిలో పడేసి..

author img

By

Published : Nov 21, 2022, 12:38 PM IST

father rape daughter

వేరొకరిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ ప్రియుడి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలో పడేశాడు. ఈ దారుణం యూపీలోని ఆజంగఢ్​లో జరిగింది. మరోవైపు, కన్నకూతురిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘోరమే జరిగింది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఓ యువతిని అతిదారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..
ఆజంగఢ్‌ జిల్లాలోని ఇషాఖ్‌పుర్‌ గ్రామానికి చెందిన ఆరాధన.. అదే ప్రాంతానికి చెందిన ప్రిన్స్‌ యాదవ్‌ గతంలో ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఈ ఏడాది ఆరంభంలో ఆరాధన మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ప్రిన్స్‌ ఎలాగైనా ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. ఈ నెల 9వ తేదిన గుడికి వెళ్దామంటూ ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన స్నేహితుల సాయంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ పాలిథీన్‌ బ్యాగ్‌లో కుక్కి, బావిలో పడేశాడు.

ఆరాధన కనిపించకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన గ్రామ శివారులోని ఓ బావిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత శనివారం ప్రిన్స్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు వారిపై దేశీయ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఎదురుకాల్పులు జరిపి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రిన్స్‌తో పాటు అతడికి సహకరించిన కుటుంసభ్యులు, స్నేహితులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం..
ఉత్తర్​ప్రదేశ్ సహరన్​పుర్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. ప్రస్తుతం బాధితురాలు మూడు నెలల గర్భిణీ కావడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా వారు నిందితుడిపై కేసు నమోదు చేయలేదు. ఈ క్రమంలో మీడియాను ఆశ్రయించి.. తనకు న్యాయం చేయాలని కోరింది. మీడియాతో కలిసి వెళ్లి నిందితుడిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ జరిగింది.. బాధితురాలి తల్లి మరణించినప్పటి నుంచి నిందితుడు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కత్తితో బాధితురాలిని బెదిరించి ఈ దారుణానికి ఒడిగడుతున్నాడు. తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని చెప్పినా కుటుంబ సభ్యులు నమ్మలేదని చెప్పింది. అందుకే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని.. ప్రస్తుతం తాను గర్భిణీని అని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అత్యాచార ఘటనపై కేసు నమోదుచేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

గొడవల కారణంగా..
ఝార్ఖండ్ సరాయ్​కేలాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, పదేళ్ల కుమారుడిని హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవే ఈ హత్యలకు కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రేయసిని కలిసేందుకు వెళ్లిన ప్రియుడిని..
బిహార్‌ నలందాలో దారుణం జరిగింది. ప్రేయసిని కలిసేందుకు వెళ్లిన యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. యువకుడిని చంపి.. చేతులు, కాళ్లు, మెడ, ఇతర శరీర భాగాలను ఆరు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. మృతుడిని వికాస్​(30)గా పోలీసులు గుర్తించారు. యువకుడిని హత్య చేసింది అతడి ప్రియురాలు, ఆమె భర్తేనని పోలీసుల విచారణలో తేలింది.

father kept raping daughter
మృతుడు వికాస్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవంబర్ 16 నుంచి వికాస్ కనిపించట్లేదు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ కేసులో మృతుడి ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్తతో కలిసి వికాస్​ను హతమార్చినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. చదువుతుకునే రోజుల్లోనే వికాస్​, వివాహితురాలు ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. వికాస్​కు ఒక కుమారుడు ఉండగా.. వివాహిత మహిళకు ఇద్దరు సంతానం ఉన్నారు.

గర్భం దాల్చిన మైనర్​..
మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో దారుణం జరిగింది. 15 ఏళ్ల మైనర్​పై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువును తన ఇంటికి తీసుకెళ్లడానికి బాధితురాలి తల్లి, ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం శిశువు చైల్డ్ కేర్ హోమ్​లో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.