Rakesh Tikait news: భారతీయ కిసాన్ యూనియన్(BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తన చావును కోరుకుంటోందని అన్నారు. కర్ణాటక, దిల్లీలో తనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్ మేరఠ్లోని కంకర్ ఖేరాలో నిర్వహించిన కిసాన్ పంచాయత్లో పాల్గొన్న అనంతరం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారం కుట్ర పూరితంగానే కర్ణాటకలో తనపై సిరా దాడి చేశారని టికాయిత్ ఆరోపించారు. గతేడాది డిసెంబర్లో జనరల్ బిపిన్ రావత్ మరణించినప్పుడు నివాళులు అర్పించేందుకు దిల్లీలో ఆయన నివాసానికి వెళ్లిన సమయంలోనూ తనపై కొందరు దాడి చేశారని వెల్లడించారు.
"రైతు సంఘాల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం విద్రోహ రాజకీయాలు చేస్తోంది. దీన్ని గ్రహించి రైతులు ఐక్యంగా ఉండాలి. టికాయిత్ కుటుంబం ఎప్పుడూ రైతుల కోసం గళమెత్తుతూనే ఉంది. భవిష్యత్తులో ఇది కొనసాగుతుంది. మహేంద్ర సింగ్ టికాయిత్ తర్వాత ఇప్పుడు నరేశ్ టికాయిత్ రైతు సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. టికాయిత్ కుటుంబం ఒత్తిళ్లకు లొంగదు. యూపీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తామంది. ఇప్పుడేమో బోరు బావుల వద్ద మీటర్లు బిగించాలని వేధిస్తోంది. ఇది ఎంతమాత్రమూ సహించదగ్గ విషయం కాదు. 10 ఏళ్ల పైడిన ట్రాక్టర్లను నిలిపివేస్తున్నారు. ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా బీకేయూ పోరాడుతోంది. రైతులంతా సంఘటితమై పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వంపై పోరాటాలకు ఫలితాలు వస్తాయి. కేంద్రం చర్చలకు వచ్చేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అప్పటివరకు పరిష్కారం లేదు."
-రాకేశ్ టికాయిత్
ఇదీ చదవండి: మైనారిటీ చట్టం నిబంధనలు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్