ETV Bharat / bharat

'అమ్మా మీ పిల్లలను స్కూల్​కు పంపండి ప్లీజ్​' రోజూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్తున్న టీచర్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 9:40 PM IST

Govt School Bad Situation
Govt School Bad Situation

Government School Bad Situation : విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళితే గానీ ఆ పిల్లలు స్కూల్​కు రావడం లేదు. దీంతో రోజూ టీచర్లు విద్యార్థుల ఇంటింటికి వెళ్లి పిల్లలను పిలుస్తున్నారు. అయినా ఫలితం ఉండట్లేదని టీచర్లు వాపోతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే?

Government School Bad Situation : సాధారణంగా కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఉన్నా టీచర్లు లేరని వింటుంటాం. కానీ బంగాల్​లోని ఓ పాఠశాలలో మాత్రం టీచర్లు ఉన్నా చదువుకోవడానికి విద్యార్థులు కరవయ్యారు! గ్రామంలోని విద్యార్థుల ఇంటింటికి ఉపాధ్యాయులు వెళ్లి మరి పిలుస్తున్నా పిల్లలు రావడం లేదు.

మేదినీపుర్​ జిల్లాలోని శహీద్​ ఖుదీరామ్ ప్రాథమిక పాఠశాల ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పాఠశాలలో 50-60 మంది విద్యార్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు వారి సంఖ్య ఎనిమిది మందికి పడిపోయింది. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే వారి సంఖ్య నాలుగు మాత్రమే. ఆ నలుగురి ఇంటికి కూడా ఉపాధ్యాయులు వెళ్లి పిలిస్తే తప్ప వారు కూడా రావట్లేదు.

Govt School Bad Situation
శహీద్ ఖుదీరామ్​ ప్రాథమిక పాఠశాల

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయులు గ్రామస్థులతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలో చదివితే హైస్కూల్​లో అవకాశం రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ పిల్లలను గ్రామంలోని ప్రాథమిక స్కూల్​కు పంపలేకపోతున్నామని చెబుతున్నారు.

Govt School Bad Situation
విద్యార్థి తల్లితో మాట్లాడుతున్న ఉపాధ్యాయుని

"విద్యార్థులు పాఠశాలకు రాకపోవడానికి ప్రధాన కారణం హైస్కూల్​లు. వాటిలో ప్రాథమిక విద్యతో పాటు హైస్కూల్ విద్య కూడా ఉంది. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలను వాటిలో చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాథమిక విద్యే మాత్రమే ఉంది. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైమరీ పాఠశాలకు పంపించట్లేదు. అందువల్లనే విద్యార్థుల కోసం రోజూ ఇంటింటికీ వెళ్తున్నాం"

-నజీమా ఖతూన్, ప్రధానోపాధ్యాయురాలు

'ఒకప్పుడు పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థులతో క్లాస్​ రూమ్​లు రద్దీగా ఉండేవి. కానీ ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఎనిమిది మందికి తగ్గింది. చాలా బాధగా అనిపిస్తోంది. పిల్లలను పాఠశాలకు తీసుకురావడానికి ప్రతిరోజూ గ్రామంలోని ఇళ్లకు వెళ్తున్నాం. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది' అని పాఠశాల వైస్​ ప్రిన్సిపల్ సారథి కర్ తెలిపారు. ఒకప్పుడు తమ స్కూల్​లో చాలా విద్యార్థులు ఉండేవారని ఓ విద్యార్థిని రూబీ డ్యూల్​ తెలిపింది. వారంతా ఇప్పుడు వేరే స్కూల్​లో చదువుతున్నారని చెప్పింది. తమ స్కూల్​కు తిరిగి పాత వైభవం రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.