ETV Bharat / bharat

భరతమాత విముక్తికి ఆత్మార్పణ చేసిన వీరనారి అవంతిబాయి

author img

By

Published : Aug 22, 2021, 6:03 AM IST

భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది అంటే...1857 తిరుగుబాటు, ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయినే కీర్తిస్తారు. కానీ అంతకు వందేళ్ల ముందే ఓ మహారాణి తెల్లదొరతనం పై మహోగ్రంగా పోరాడారు. మహాగ్నిలా రగిలి ఎదురునిలిచారు. తెల్లదొరల కబంధ హస్తాలనుంచి భరతమాత విముక్తికి ఆత్మార్పణ చేశారు. దేశం మరచిన అకళంక, అసమాన యోధురాలు మరెవరో కాదు. ఆమే అమర వీరనారి , రామ్‌గఢ్‌ మహారాణి అవంతిబాయి . చరిత్ర మరచిన వీరధీరనారి ధన్యచరిత్రను ఒక్కసారి తల్చుకుందాం.

Rani Avantibai of Ramgarh
గుర్తింపులేని యోధురాలిగా మిగిలిన అవంతిబాయి

గుర్తింపులేని యోధురాలిగా మిగిలిన అవంతిబాయి

1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే అందరికీ తెలుసు. దేశమాత విముక్తికి జరిగిన పోరాటానికి 1857కంటే వందేళ్ల ముందే బీజం పడిందని ఎందరికి తెలుసు? ఝన్సీరాణి లక్ష్మీ బాయి కంటే ముందే ఓ వీరనారి దేశంకోసం ప్రాణాలర్పించిన వీరనారి, రామ్ గఢ్‌ రాణి అవంతీబాయి. బ్రిటిష్ వాళ్లు ఆమె తిరుగుబాటును అణచివేసి ఉండవచ్చు. కానీ అవంతీబాయి పోరాటం ఒక బలమైన సందేశాన్నిచ్చింది. అది రవి అస్తమించే బ్రిటీష్ రాజ్యం కావటం తథ్యమని చాటింది.

ఇవాళ విశ్వమంతా మహిళలు సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. వీరంతా రాణి అవంతిబాయి వీరోచిన పోరును స్ఫూర్తిగా తీసుకోవాలి. 1857కు వందేళ్లముందే స్వాతంత్ర్యోద్యానికి ఊపిరి అందించిన వీరనారి అవంతిబాయి. భరతమాత విముక్తికి ప్రాణాలర్పించీ గుర్తింపులేని యోధురాలిగా మిగిలిపోయారు.

భారతీయుల్లో స్వాతంత్యకాంక్షకు బీజం వేసిన రాణి అవంతిబాయి.. 1831 ఆగస్టు 16న మధ్యప్రదేశ్‌ లోని సియోనిజిల్లా మాంఖేడిలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు అంతో బాయి అని పేరుపెట్టారు. అల్లారుముద్దుగా పెంచి విద్యతో పాటు యుద్ధవిద్యలూ నేర్పించారు. ఆనాడు ఆదరణపొందిన కత్తియుద్ధం, విలువిద్య, సైనిక వ్యూహాం, దౌత్యనీతి అన్నీ నేర్చింది. ఆమెకు 1848లో రామ్ గఢ్‌ సంస్థాన మహారాజు కుమారుడు విక్రమాదిత్య సింగ్ తో వివాహమైంది. వివాహనంతరం తన పేరును అవంతీబాయిగా మార్చుకుంది.

రాణి అసలు పేరు అంతో బాయి. అత్తవారింట ఆమె పేరు అవంతిబాయిగా మారింది. రామ్‌గఢ్‌ చరిత్రలో ఆమె పేరు అవంతిబాయిగా మాత్రమే నమోదైంది. ఆమె మామగారి పేరు లక్ష్మణ్‌ సింగ్‌. ఆయన కుమారుడు, అవంతి భర్త విక్రమాదిత్య సింగ్‌.

-నరేశ్‌, చరిత్రకారుడు, రచయిత

రామ్‌గఢ్‌ మహారాజు లక్షణ్‌ సింగ్ మరణించారు. కుమారుడు విక్రమాదిత్య మహారాజయ్యారు. కానీ కొద్ది సంవత్సరాలకు రాజా విక్రమాదిత్య సింగ్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. విక్రమాదిత్యకు, అవంతిబాయికి అమన్ సింగ్, షేర్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కానీ చిన్న వయస్సులో ఉండటంతో ..మహారాణి అవంతిబాయి రాజ్యపాలన చేపట్టారు. రాజుల్లేని రాజ్యాల ఆక్రమణకు బ్రిటిషర్లు రాజ్యసంక్రమణ సిద్ధాంత ఎత్తుగడ వేశారు. అవంతిబాయిని మహారాణిగా గుర్తించడానికి నిరాకరిస్తూ..ప్రత్యేక పరిపాలకుణ్ణి నియమించారు.

విక్రమాదిత్యసింగ్ మరణానంతరం ఓ క్లిష్ట సమస్య మహారాణి ముందుకు వచ్చింది. ఇద్దరు కుమారులు చిన్నవాళ్లు. ఢిల్లీలో కూర్చుని రాజ్యాన్ని కబళించటమే లార్డ్ డల్హౌసీ విధానం. రాజ్యస్వాధీనానికి కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్ ను అమలుచేశారు.

- నరేశ్‌, చరిత్రకారుడు, రచయిత

బ్రిటిషర్ల అవమానకర నిర్ణయంతో రామ్‌గఢ్‌ సంస్థానంల నిరసన పెల్లబికింది. మహారాణి అవంతిబాయి ఆగ్రహంతో ఆ నిర్ణయాన్ని బుట్టదాఖలు చేశారు. బ్రిటిషర్లమీద యుద్ధం ప్రకటించారు. ఖేరి గ్రామంలో రణభేరి మోగింది. ఆమె మెరుపు వ్యూహంతో తెల్లదొరలు కంగుతిన్నారు. యుద్ధంలో తొలి ఓటమి చవిచూశారు. కానీ వెంటనే తేరుకున్న బ్రిటిష్ బలగాలు...మండ్లా డిప్యూటి కమిషనర్ వాడ్డింగ్టన్ ఆధ్యర్యంలో రామ్​గఢ్‌ కోటపై దాడిచేశాయి. ఆమె సైనికులు వీరోచితంగా పోరాడారు. కానీ బ్రిటషర్ల బలగాలు మరిన్ని వచ్చిచేరటంతో మహారాణి అవంతిబాయి దళాలు దేవరిగఢ్‌ కొండల్లోని దట్టమైన అడవులోకి వెళ్లిపోయాయి.

మహారాణి దళాలను బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టింది. వారితో పోలిస్తే మహారాణి బలం దిగదుడుపైంది. ఆమెకు లొంగిపోక గత్యంతరం లేని పరిస్థితి ఎదురైంది.

-నరేశ్‌, చరిత్రకారుడు, రచయిత

బ్రిటిషు వాళ్లు మహారాణిని లొంగిపోవాలని సందేశం పంపించారు. కానీ మహారాణి అందుకు తిరస్కరించారు.

మహారాణి సైన్యంలో కొద్దిమందే మిగిలారు. ఇక యుద్ధం కొనసాగించటం అసంభవం అని ఆమెకు అర్ధమైంది. ఒకవేళ తను లొంగిపోతే బ్రిటిషువాళ్లు ఎంతో నికృష్టంగా ప్రవర్తిస్తారో ఆమెకు అర్ధమైంది.

-నరేశ్‌, చరిత్రకారుడు, రచయిత

వీరమరణమే తప్ప ..శరణుకోరే ప్రశ్నేలేదని అవంతిబాయి నిశ్చయించారు. 'ఆత్మార్పణతో ఆరని జ్వాల రగలాలి. రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం కూలిపోవాలి' అని శపథం చేసింది. ఆరోజు 1858 మార్చి 28. చుట్టుముట్టిన సైనికులు వచ్చేస్తుండగా ...ఒక్కసారి ఒరలోంచి కత్తి తీశారు. తనను తాను భరతమాతకు సమిధగా ఆహుతి ఇచ్చుకున్నారు. చిందిన ఆ రక్తం వృధా కాలేదు. దేశమంతా ఉద్యమాల వెల్లువైంది. అగ్ని జ్వాల రగులుకుంది. మరో తొంభైఏళ్లకు ఆమె కలలు పండాయి. భరతమాతకు విముక్తి లభించింది.

ఇదీ చూడండి: గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.