ETV Bharat / bharat

నెహ్రూ మద్దతు లేకుండానే ప్రథమ రాష్ట్రపతిగా బాబూ!

author img

By

Published : Jul 5, 2022, 8:20 AM IST

first president of india
first president of india

దేశానికి ప్రథమ రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్.. అప్పటి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ మద్దతు లేకుండానే ఆ పదవిలోకి వచ్చారు. రాష్ట్రపతి పదవికి ఆయన సరైన వ్యక్తి కాదని భావించిన నెహ్రూ.. అప్పటి ముఖ్య నేతల ఒత్తిడికి తలొగ్గారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మద్దతు లేకపోయినా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ రాష్ట్రపతి అయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గవర్నర్‌ జనరల్‌గా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ ఉన్నారు. 1948లో ఆయన ఇంగ్లండ్‌ వెళ్లిపోవడంతో చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) ఆ పదవిలో నియమితులయ్యారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ జనరల్‌ స్థానంలో రాష్ట్రపతి ఉంటారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేందుకు అప్పటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. ఫలితంగా రాజ్యాంగ సభ ద్వారానే రాష్ట్రపతిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఆ సభకు అధ్యక్షునిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతి పదవికి తొలి ఎంపికగా అంతా భావించారు. నెహ్రూ మాత్రం ప్రథమ రాష్ట్రపతిగా రాజాజీ ఉండాలని అభిలషించారు. రాజేంద్రప్రసాద్‌ ప్రగాఢమైన మత విశ్వాసాలున్న వ్యక్తి అనీ, రాష్ట్రపతి పదవికి ఆయన సరైన వ్యక్తి కాదని నెహ్రూ భావించారు.

లేఖతో మనస్తాపం
రాజాజీ రాష్ట్రపతి కావాలని తాను ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఉప ప్రధానమంత్రి వల్లభ్‌భాయ్‌ పటేల్‌తోనూ చర్చించినట్లు నెహ్రూ తనకు రాసిన లేఖతో రాజేంద్రప్రసాద్‌ మనస్తాపానికి గురయ్యారు. దానిపై నెహ్రూ, పటేల్‌లకు సుదీర్ఘ లేఖలు రాశారు. గౌరవంగా పక్కకు తప్పుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తనతో చర్చించకుండానే నెహ్రూ తన పేరును వివాదంలోకి లాగుతున్నారని పటేల్‌ అసంతృప్తికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు ముగ్గురి నేతల మధ్య లేఖలు కొనసాగాయి.

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించినందున ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిగా ఒప్పుకోబోమని రాజ్యాంగ సభ సభ్యులు, పటేల్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి ముఖ్య నాయకులు తేల్చిచెప్పేశారు. వారంతా రాజేంద్రప్రసాద్‌ వైపే మొగ్గు చూపారు. రాజ్యాంగ సభ ఏకగీవ్రంగా ఎన్నుకోవడంతో రాజేంద్రప్రసాద్‌ 1950 జనవరి 26న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత 1952లో కె.టి.షాపైన, 1957లో చౌదరి హరిరామ్‌పైన భారీ మెజారిటీతో ఆయన రాష్ట్రపతిగా గెలిచారు. మొత్తంగా ఆ పదవిలో 12 సంవత్సరాలకు పైగా కొనసాగారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.