ETV Bharat / bharat

మణప్పురం ఫైనాన్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

author img

By

Published : May 3, 2023, 11:59 AM IST

Updated : May 3, 2023, 1:56 PM IST

మణప్పురం ఫైనాన్స్​కు చెందిన కార్యాలయాల్లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ సోదాలు జరిపింది. ఆర్​బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేసింది.

ED conducts searches at Manappuram Finance
ED conducts searches at Manappuram Finance

ప్రముఖ నాన్​ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ 'మణప్పురం ఫైనాన్స్​' కార్యాలయాల్లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం కేరళలోని నాలుగు చోట్ల ఈ దాడులు చేసింది. త్రిస్సూర్​లోని కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థకు చెందిన ప్రమోటర్లకు సంబంధించి మొత్తం 4 చోట్ల ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు తనిఖీలు జరిపారు.

రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలకు విరుద్ధంగా.. ప్రజల నుంచి మణప్పురం ఫైనాన్స్ సంస్థ రూ.150 కోట్లు డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఈ సోదాలు జరిపినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థ భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకు సంబంధించి దస్త్రాలను సేకరించి, కంపెనీ ప్రతినిధుల స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని భావిస్తున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ వర్గాలు వివరించాయి. ఈడీ సోదాలపై మణప్పురం ఫైనాన్స్ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు
బంగాల్​లోని రాయ్​గంజ్​ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కల్యాణి ఇంటిపైనా దాడులు నిర్వహించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​. బుధవారం ఉదయం ఆయన నివాసం సహా కార్యాలయం, షోరూంలో సోదాలు జరిపారు అధికారులు. ఈ సోదాలకు కారణం వెల్లడించలేదు ఈడీ. అయితే, ఇదివరకే ఫుడ్స్​, ఎడిబుల్​ ఆయిల్​ కంపెనీ, కోల్​కతా కేంద్రంగా నడిచే రెండు టీవీ ఛానల్స్​ మధ్య జరిగిన నగదు లావాదేవీ వ్యవహారంలో ఆయనకు నోటీసులు అందజేసింది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణ కల్యాణి.. రాజీనామా చేయకుండానే తృణముల్ కాంగ్రెస్​లో చేరారు. అనంతరం ప్రజా పద్దుల​ కమిటీ ఛైర్మన్​గా నియమితులయ్యారు. ఈ సోదాలపై ఎమ్మెల్యే కృష్ణ కల్యాణి సోదరుడు ప్రదీప్​ స్పందించారు. సరైన కారణాలు చెప్పకుండానే ఈడీ సోదాలు నిర్వహించిందని ఆరోపించారు.

పండ్ల డబ్బాల్లో ఉన్న రూ. కోటి సీజ్ చేసిన ఐటీ
కర్ణాటక మైసూరుకు చెందిన వ్యాపారి కే సబ్రమణ్య రాయ్​ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈ సోదాల్లో కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని గార్డెన్​లో పండ్ల డబ్బాల్లో నగదును దాచిపెట్టగా సీజ్​ చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఆయన నివాసంతో పాటు షాపులు సహా ఐదు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈయన సోదరుడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పుత్తూరు విధానసభ నుంచి పోటీ చేస్తున్నారు. సుబ్రమణ్యం.. రియల్​ ఎస్టేట్​ సహా స్వీట్లు​, పండ్ల వ్యాపారాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి : దాహం తీరాలంటే రోజూ ఎండలో 2కి.మీ నడవాల్సిందే!

స్వలింగ సంపర్క జంటలపై కేంద్రం కీలక నిర్ణయం.. సమస్యల పరిష్కారానికి కమిటీ

Last Updated : May 3, 2023, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.