ETV Bharat / bharat

స్వలింగ సంపర్క జంటలపై కేంద్రం కీలక నిర్ణయం.. సమస్యల పరిష్కారానికి కమిటీ

author img

By

Published : May 3, 2023, 12:27 PM IST

Updated : May 3, 2023, 1:28 PM IST

Supreme Court Judgement On Same Sex Marriage And Government Committee On It
స్వలింగ సంపర్క జంటలపై కేంద్రం కీలక నిర్ణయం.. సమస్యల పరిష్కారానికి కమిటీ

స్వలింగ సంపర్కుల జంటల సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు సిద్ధమైంది.

స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. LGBTQల సమస్యల పరిష్కారానికి పాలనాపరమైన చర్యలను అన్వేషించేందుకు కేబినేట్‌ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని బుధవారం సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. సామాజిక హక్కులకు దూరం అవుతున్న స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 27న కేంద్రానికి సూచించిన నేపథ్యంలో మోదీ సర్కార్​ ఈ మేరకు స్పందించింది.

కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. LGBTQల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ధర్మాసనానికి తెలిపారు. అయితే వివాహ చట్టబద్ధత అంశం లేకుండా కమిటీ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. ఇది ఒక మంత్రిత్వశాఖ పరిధిలోని అంశం కాదని.. అనేక మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో జరగాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏమేం చేయాలో LGBTQలు కూడా తమ సలహాలు, సూచనలు కమిటీకి ఇవ్వొచ్చని మెహతా కేంద్రం తరుపున వివరించారు. ఇన్షూరెన్స్‌ పాలసీల్లో భాగస్వామిని నామినీగా చేసే విషయం, జాయింట్‌ బ్యాంకు ఖాతాల వంటి అనేక అంశాల్లో LGBTQలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన న్యాయస్థానానికి తెలిపారు.

జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్​ పీఎస్ నరసింహతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై కొద్దిరోజులుగా విచారణ జరుపుతోంది. ఏప్రిల్ 27న ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం.. స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేయకుండా సామాజిక సంక్షేమ ప్రయోజనాలను అందేలా చేయొచ్చా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

రాజోనా ఉరిశిక్షను మార్చేందుకు సుప్రీం 'నో'!
మరోవైపు 1995లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన బల్వంత్ సింగ్ రాజోనాకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ కూడా ఈ కేసులో అవసరమని సుప్రీం పేర్కొంది. రిట్ పిటిషన్​ ద్వారా క్షమాభిక్ష దావాను అవసరమైనప్పుడు మళ్లీ పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునేందుకు ఆదేశించామని జస్టిస్​ బీఆర్ గవాయ్, జస్టిస్​ విక్రమ్ నాథ్, జస్టిస్​ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

దోషిగా తేలిన తర్వాత 26 ఏళ్లుగా జైలులో ఉన్నారు బల్వంత్ సింగ్ రాజోనా. కాగా, ఆయన క్షమాభిక్ష అభ్యర్థన దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ దోషి తరఫున వాదనలు వినిపించారు. వీటిన విన్న న్యాయస్థానం రాజోనా పిటిషన్‌పై మార్చి 2న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Last Updated :May 3, 2023, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.