ETV Bharat / bharat

'మహిళలూ! చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు'

author img

By

Published : Oct 24, 2021, 9:51 AM IST

సాయంత్రం ఐదు దాటాక మహిళలు పోలీస్ స్టేషన్​కు వెళ్లొద్దంటూ ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, భాజపా నేత బేబీరాణి మౌర్య (Baby Rani Maurya BJP) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా (UP news) స్పందించాయి.

baby rani mourya
బేబీ రాణి మౌర్య

చీకటి పడ్డాక మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దని, ఠాణాల వైపు వెళ్లాలంటే కుటుంబంలోని పురుషుల తోడు తీసుకోవడం ఉత్తమమని ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మౌర్య (Baby Rani Maurya BJP) హితవు పలికారు. వారణాసిలోని బజర్‌డీహా ప్రాంత వాల్మీకి బస్తీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో (Controversial Statements by BJP leaders) మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

బేబీ రాణి వివాదాస్పద వ్యాఖ్యలు

"పోలీస్‌స్టేషన్లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. అయినా సాయంత్రం 5 దాటాక అటు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త. మీ తండ్రినో, సోదరుడినో తీసుకెళ్లండి. లేదంటే మరుసటి రోజు ఉదయం వెళ్లండి" అని హెచ్చరించారు.

విపక్షాల విమర్శలు

బేబీరాణి వ్యాఖ్యల వీడియోను బీఎస్పీ ఎంపీ కుంవర్‌ దానిశ్‌ అలి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. 'ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో (UP news) పోలీస్‌స్టేషన్లు మహిళలకు ప్రమాదకరంగా మారాయన్న మాట' అని వ్యాఖ్య జోడించారు.

బేబీరాణి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్షు అవస్థి తీవ్రంగా స్పందించారు. భాజపా, ఆరెస్సెస్ ఆలోచనా విధానానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.

"సాయంత్రం 5 తర్వాత మహిళలు పోలీస్ స్టేషన్​కు ఎందుకు వెళ్లకూడదు? యూపీలో ఏ విధమైన ఆటవిక పాలన నడుస్తుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. మహిళలు సాయంత్రం ఐదు తర్వాత పోలీస్ స్టేషన్​కు కూడా వెళ్లలేరు. ఓ వైపు ప్రియాంక గాంధీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వం వారిని బలహీనంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. కానీ, యూపీలోని మహిళలకు.. రాణి లక్ష్మీ భాయి, కల్పనా చావ్లా, ఇందిరా గాంధీలకు ఉన్నంత శక్తి ఉంది."

-అన్షు అవస్థి, కాంగ్రెస్ ప్రతినిధి

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సైతం మౌర్య వ్యాఖ్యలను ఖండించారు. బేటీ బచావో అంటే ఇదేనేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వివరణ

విపక్షాల నుంచి ఎదురైన విమర్శలతో భాజపా స్పందించింది. పౌరులను తమ పార్టీ వివక్షతో చూడదని స్పష్టం చేసింది. ఎవరైనా, ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్​కు వెళ్లొచ్చని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై బేబీమౌర్య వివరణ ఇచ్చారు. విపక్షాలు తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారని అన్నారు. సీఎం యోగి, పీఎం మోదీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించే వివరించానని చెప్పారు. మహిళలు సత్వర న్యాయం పొందేలా ఫాస్ట్​ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.