ETV Bharat / bharat

వైద్యులపై కరోనా పంజా.. బిహార్​లో మరో 59మందికి పాజిటివ్​

author img

By

Published : Jan 5, 2022, 11:19 AM IST

Doctors corona: దేశంలో కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. బిహార్​లోని నలంద ఆస్పత్రిలో మరో 59మంది డాక్టర్లకు పాజిటివ్​గా తేలింది. దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోనూ 50మంది వైద్యులకు వైరస్​ నిర్ధరణ అయింది. అంతేగాక విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో కొవిడ్ కోరల్లో చిక్కుకోవడం కలవరపరుస్తోంది.

corona effect on doctors
వైద్యులపై కరోనా పంజా

Doctors corona: వైద్యులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. బిహార్​లోని నలంద వైద్యకళాశాల ఆస్పత్రితో మరో 59మంది డాక్టర్లకు పాజిటివ్​గా తేలింది. సోమవారం ఇదే హాస్పిటల్​లో 72మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో ఇక్కడ వైరస్ సోకిన వైద్యుల సంఖ్య 218కి చేరింది. జనవవరి 1-2మధ్య ఈ ఆస్పత్రిలో 87మంది వైద్యులు కరోనా బారినపడటం గమనార్హం. 2021 చివరి వారం పట్నాలో నిర్వహించిన 96వ వార్షిక వైద్య సదస్సు అనంతరం డాక్టర్లు వరుసగా కరోనా బారినపడుతున్నారు. భారత వైద్య సమాఖ్య(ఐఎంఏ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ సీఎం నితీశ్​ కుమార్ కూడా పాల్గొన్నారు.

  • ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో వైద్యులు.. వైరస్​ బాధితులుగా మారుతున్నారని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇలానే జరిగిందని పేర్కొంది. అప్పుడు బిహార్లోనే అత్యధికంగా వైద్యుల మరణాలు నమోదయ్యాయని చెప్పింది.
  • దేశ రాజధాని దిల్లీలోనూ వైద్యులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఎయిమ్స్​లో కనీసం 50మంది డాక్టర్లకు వైరస్ నిర్ధరణ అయింది. గత కొద్ది రోజుల్లో దిల్లీ వ్యాప్తంగా మొత్తం 120మంది వైద్యులకు పాాజిటివ్​గా తేలింది.
  • బంగాల్​లో కూడా ఎక్కువ సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. గతవారంలో కోల్​కతాలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 200మంది డాక్టర్లు వైరస్ బారినపడ్డారు.
  • అయితే వైద్యులు కరోనా బారినపడుతున్నారని రోగులు ఆందోళన చెందవద్దని నిపుణులు సూచించారు. డాక్టర్లను అత్యవసరం అయితేనే భౌతికంగా సంప్రదించాలని చెబుతున్నారు. చిన్న చిన్న సమస్యలకైతే ఫోన్ల ద్వారా సంప్రదిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
  • వైద్యుల పరిస్థితి చూసి ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐఎంఏ అధ్యక్షుడు డా.సహజానంద్ ఈటీవీ భారత్​కు తెలిపారు. కరోనా బారినపడిన డాక్టర్లకు స్వల్ప లక్షణాలే ఉ్ననాయని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్​ వల్లే కేసులు పెరుగుతున్నాయని, అయితే దాని తీవ్రత తక్కువగా ఉన్నట్లు చెప్పారు. వాక్సిన్​ తీసుకున్నంత మాత్రాన కరోనా రాదని చెప్పలేమని, అయితే వ్యాధి తీవ్రతను తగ్గించి ప్రాణాపాయ ముప్పు నుంచి మాత్రం టీకా రక్షిస్తుందని స్పష్టం చేశారు.

విద్యార్థులకూ కరోనా..

  • పంజాబ్​ పాటియాలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం 100మంది వైద్య విద్యార్థులు కరోనా బారినపడ్డారు.
  • జమ్ముకశ్మీర్ కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో మంగళవారం 140మంది విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. గత నాలుగు రోజుల్లో ఇక్కడ 187మంది వైరస్​ బారినపడ్డారు. సోమవారం 13మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయిన అనంతర జనవరి మొదటి వారంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షల తదపురి షెడ్యూల్​ను తర్వాత విడుదల చేస్తామంది. విద్యార్థులు సహా మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చదవండి: భారత్​ బయోటెక్​ చుక్కల మందు టీకా పరీక్షలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.