ETV Bharat / bharat

Delhi Assembly Panel Visit AP : కుల ధ్రువీకరణ వివాదం.. విశాఖ IASపై దిల్లీ సర్కార్ నజర్.. అనకాపల్లికి వచ్చి మరీ..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 1:06 PM IST

Delhi Assembly Panel Visit AP
Delhi Assembly Panel Visit AP

Delhi Assembly Panel Visit AP : దిల్లీ విజిలెన్స్​ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్​.. కుల ధ్రువీకరణ పత్రంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. ఆయన ఓబీసీ సర్టిఫికెట్​ను వెరిఫై చేసేందుకు ముగ్గురు సభ్యుల దిల్లీ అసెంబ్లీ ప్యానెల్.. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నానికి వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే?

Delhi Assembly Panel Visit AP : దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, సీనియర్​ అధికారులకు మధ్య వాగ్యుద్ధం నడుస్తుండగా.. ఆసక్తికరమైన పరిణామం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దిల్లీ విజిలెన్స్​ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్‌ స్వగ్రామానికి ముగ్గురు ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలతో కూడిన అసెంబ్లీ కమిటీ వెళ్లడం చర్చనీయాంశమైంది. రాజశేఖర్​ ఓబీసీ సర్టిఫికెట్‌ను ధ్రువీకరించేందుకు.. ఆంధ్రప్రదేశ్​కు కమిటీ వెళ్లినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే?
దిల్లీ విజిలెన్స్​ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్​.. 1994లో సివిల్స్​ పరీక్షలు రాస్తున్న సమయంలో నకిలీ ఓబీసీ సర్టిఫికెట్​ సమర్పించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. రాజశేఖర్​ ఓబీసీ వర్గానికి చెందిన వారు కాదని ఫిర్యాదులో ఉంది. దీంతో DANICS (దిల్లీ అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్) అధికారి ప్రేమ్​నాథ్​.. ఈ ఏడాది జూన్​లో రాజశేఖర్​ను సస్పెండ్​ చేశారు.

అయితే దిల్లీ ఓబీసీ సంక్షేమ కమిటీ.. రాజశేఖర్​పై వచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంది. తన అభిప్రాయాన్ని తెలిపేందుకు కమిటీ ముందు హాజరుకావాలని రాజశేఖర్​కు​ నోటీసు పంపింది. కానీ ఆయన కమిటీ ముందు హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం.. తనకు నోటీసులు పంపే అధికారం ఓబీసీ సంక్షేమ కమిటీకి లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై రాజశేఖర్​ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో రాజశేఖర్​ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపేందుకు ఆప్​ ఎమ్యెల్యే మదన్​లాల్​ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ.. ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నం సమీపంలో ఉన్న అనకాపల్లికి వెళ్లింది.

రాజశేఖర్‌కు కమిటీ పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన తమ ముందు హాజరు కాలేదని ఎమ్మెల్యే మదన్ లాల్ తెలిపారు. ఆ తర్వాత సేవలు, విజిలెన్స్ విభాగాల నుంచి సమాచారాన్ని కోరామని.. వారు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపారు. రాజశేఖర్​ స్వగ్రామమైన అనకాపల్లిలో కూడా అధికారులు తమకు సహకరించలేదని ఆరోపించారు. రాజశేఖర్​ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. తదుపరి సమావేశంలో కమిటీ తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(UPSC) ద్వారా దిల్లీ అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్ (DANICS) అధికారిగా రాజశేఖర్​.. సుమారు 30 ఏళ్ల క్రితం ఎంపికయ్యారు. నియమాక సమయంలోనే రాజశేఖర్​ కులధ్రువీకరణ పత్రాన్ని యూపీఎస్​సీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA) ధ్రువీకరించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ శాసనసభకు 10 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలోనే ఈ మూడు కార్యాలయాలు ఉన్నట్లు చెప్పాయి. అలాంటప్పుడు ఇక్కడి కాకుండా 2వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లడం ఏంటని ప్రశ్నించాయి. కేజ్రీవాల్ ప్రభుత్వానికి​ సంబంధించిన అనేక కేసుల విచారణలను రాజశేఖర్​ పర్యవేక్షిస్తున్నారని, అందుకే ఆయనను ఆమ్​ఆద్మీ పార్టీ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపించాయి.

కేజ్రీవాల్​కు ఎల్​జీ మరో షాక్.. రూ.97కోట్లు కట్టాలని ఆదేశం.. ఎందుకంటే?

ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్​.. ఆ డబ్బులు చెల్లించాలంటూ డీఐపీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.