ETV Bharat / bharat

కొవిడ్​ మాక్​డ్రిల్​కు రంగం సిద్ధం.. 'బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి'

author img

By

Published : Dec 26, 2022, 5:58 PM IST

covid mock drill
కొవిడ్ మాక్​డ్రిల్

వివిధ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్​ వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై కేంద్రం సూచన మేరకు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాక్​డ్రిల్ నిర్వహించనున్నాయి. మరోవైపు, బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్​ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చైనా, జపాన్‌ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండం వల్ల భారత్‌ అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం సూచన మేరకు మంగళవారం రాష్ట్రాలు మాక్​డ్రిల్ నిర్వహించనున్నాయి.

ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మంగళవారం మాక్‌ డ్రిల్‌ జరగనుంది. నర్సులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లను సైతం మాక్‌ డ్రిల్‌లో భాగస్వాములు కానున్నారు. ముఖ్యంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌ పడకల లభ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్ధరణ పరీక్షలు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ ట్వీట్ ద్వారా తెలిపారు.

covid mock drill
విదేశాల నుంచి వచ్చిన వారికి నిర్ధరణ పరీక్షలు చేస్తున్న సిబ్బంది
covid mock drill
విదేశాల నుంచి వచ్చిన వారికి నిర్ధరణ పరీక్షలు చేస్తున్న సిబ్బంది

మాస్క్ తప్పనిసరి..
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని తెలిపింది. నూతన సంవత్సర వేడుకల్లో పబ్​లు, రెస్టారెంట్ల వద్ద భారీగా గుమిగూడవద్దని పేర్కొంది. ప్రజలు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ కోరారు. మాస్క్ ధరించనివారికి జరిమానా విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

"న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇస్తున్నాం. ప్రజలు బూస్టర్ డోసు వేసుకోవాలి. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, చిన్నారులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. పబ్​లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి."

--కె.సుధాకర్, ఆరోగ్యశాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.