ETV Bharat / bharat

10 మంది మంత్రులు, 20మందికిపైగా ఎమ్మెల్యేలకు కరోనా

author img

By

Published : Jan 1, 2022, 11:53 AM IST

Updated : Jan 1, 2022, 12:20 PM IST

Corona in maharashtra
మహారాష్ట్రలో కరోనా కేసులు

Corona in maharashtra: మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వీరికి కొవిడ్ సోకినట్లు తేలడం కలకలం రేపింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్ హెచ్చరించారు.

Corona in maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.

"మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారు. ముంబయి, పుణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు అనివార్యం. ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి."

-అజిత్​ పవార్​, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం.

Maharashtra corona cases: శుక్రవారం మహారాష్ట్రలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్యలో 50 శాతం వృద్ధి రికార్డయ్యింది. ఈ నేపథ్యంలోనే పవార్‌ హెచ్చరించాల్సి వచ్చింది. ఇప్పటికే జనసమూహాలపై మహారాష్ట్ర సర్కార్‌ ఆంక్షలు విధించింది. 2021 చివరి 12 రోజుల్లో మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముంబయిలో శుక్రవారం 5,631 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే 2,000 కేసులు అధికంగా నిర్ధారణ అయ్యాయి. దీంతో నగరంలో కేసులు 7,85,110కి చేరాయి. ఇక పుణెలో పాజిటివిటీ రేటు 5.9 శాతం పెరిగింది. శుక్రవారం కొత్తగా 412 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో కేసుల సంఖ్య 5,10,218కి చేరింది.

దేశంలో ఒమిక్రాన్ కలవరం..

Omicron cases in india: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రభావం కొత్త కేసులపై స్పష్టంగా కన్పిస్తోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 22వేలు దాటగా.. 400 మందికి పైగా మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 1431కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా.. దిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: Omicron Variant: 'కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోండి'

ఇదీ చూడండి: దేశంలో 'ఒమిక్రాన్' విజృంభణ.. డెల్టాను మించి!

Last Updated :Jan 1, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.