ETV Bharat / bharat

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారు, నోటిఫికేషన్ ఎప్పుడంటే

author img

By

Published : Aug 28, 2022, 4:11 PM IST

Updated : Aug 28, 2022, 5:15 PM IST

Congress president election
Congress president election

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Congress president election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేసేందుకు భేటీ అయిన సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న ఫలితాల ప్రకటన ఉందుంటని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఎన్నికల షెడ్యూల్​ను ఆమోదించారని వేణుగోపాల్ వివరించారు. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని వివరించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని స్పష్టం చేశారు.

congress-president-election
సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ అగ్రనేతలు

ఎన్నికల తేదీ ఖరారుతో పాటు పార్టీ చేపట్టదలచిన పలు కార్యక్రమాలపైనా సీడబ్ల్యూసీ చర్చించింది. ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన హల్లాబోల్ ర్యాలీని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు వివరించింది. దీంతో పాటు, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని సీడబ్ల్యూసీ ఆకాంక్షించింది.

congress-president-election
భేటీకి హాజరైన నేతలు

కాగా, ఎన్నికల తేదీ ఖరారు చేసేందుకు ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి.. సోనియా గాంధీ వర్చువల్​గా హాజరయ్యారు. వైద్య పరీక్షల కోసం సోనియా విదేశాలకు వెళ్లారు. ఆమె వెంటే రాహుల్, ప్రియాంకా గాంధీలు వెళ్లారు. ఈ క్రమంలనే ముగ్గురు కలిసి వర్చువల్​గా భేటీకి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు కీలక భేటీలో పాల్గొన్నారు. సీనియర్ నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

congress-president-election
సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్

'రాహుల్ ఎన్నికవ్వాలి'
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికవ్వాలని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. 'కాంగ్రెస్​ను రాహుల్ గాంధీ నడిపించాలి. పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలి. కాంగ్రెస్ పార్టీని ఆయన ఏకం చేయగలరు. పార్టీని బలోపేతం చేసే సత్తా ఆయనకు ఉంది' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

Last Updated :Aug 28, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.