ETV Bharat / bharat

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ రూట్ మ్యాప్.. మినీ మేనిఫెస్టో సిద్ధం!

author img

By

Published : Feb 13, 2023, 7:23 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 24-26 వరకు రాయ్​పుర్​లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించనుంది. మినీ మేనిఫెస్టోను తలపించే కీలక రాజకీయ, ఆర్థిక తీర్మానాలను మూడు రోజుల పాటు జరిగే ఈ మహా సమ్మేళనంలో ఆమోదించనుంది.

Congress plenary session
కాంగ్రెస్ పార్టీ సమావేశాలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరగునున్న పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్​ నేతృత్వంలోని ప్లీనరీ సమావేశాల ముసాయిదా కమిటీ ఫిబ్రవరి 14న తన తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. వివిధ తీర్మానాలతో పాటు పలు ప్రణాళికలను ఈ సమావేశంలో రూపొందించనుంది.

కాంగ్రెస్ పార్టీ 2024 లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మినీ మేనిఫెస్టోను తలపించేలా కీలక రాజకీయ, ఆర్థిక తీర్మానాలను మూడు రోజుల పాటు జరిగే ప్లీనరీలో ఆమోదించనుంది. రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై ఏర్పాటైన ఉప సంఘాలకు అధ్యక్షులుగా కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నియమించారు.

ఆర్థిక, రాజకీయ తీర్మానాలపై వీరప్ప మొయిలీ, చిదంబరం పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా 'రాజకీయ తీర్మానాలను సిద్ధం చేస్తున్నాం. వాటి గురించి ఇప్పుడే ఏం చెప్పలేను' అని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఈటీవీ భారత్​తో అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు, సామాజిక న్యాయం, రైతులు, వ్యవసాయం, యువత, విద్య, ఉపాధికి సంబంధించిన ఇతర తీర్మానాలను ఈ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల ఉప బృందానికి కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వం వహిస్తుండగా.. రైతుల ఉప బృందానికి హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, సామాజిక న్యాయంపై ఉప బృందానికి ముకుల్ వాస్నిక్, యువతపై పంజాబ్ కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా బ్రార్ నేతృత్వం వహిస్తున్నారు. 2022 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తనపై పోటీ చేసిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్​ను అంతర్జాతీయ వ్యవహారాల ఉపబృందానికి కన్వీనర్​గా నియమించారు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని అధికార భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని.. దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక, రాజకీయ తీర్మానాలు విధానపరమైన అంశాలను ప్రతిబింబిస్తాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల పార్టీకి కొత్త ఉత్తేజం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లో జరిగే ఈ ప్లీనరీ సమావేశానికి దేశవ్యాప్తంగా 15 వేల మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ప్లీనరీలోనే ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే పేరును పీసీసీ అధ్యక్షులు ఆమోదించనున్నారు. కాంగ్రెస్ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్లీనరీ ముగింపు సభలో వీరు ప్రసగించనున్నట్లు వెల్లడించాయి.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్​కు కీలక పరీక్ష ఈ ఏడాదిలోనే ఎదురుకానుంది. 2023లో 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీని రాజకీయ ఉప బృందం కమిటీ ప్రెసిడెంట్​గా నియమించింది. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల ఓటర్లకు పార్టీ పట్ల సానుకూల సందేశం పంపేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో పార్టీని గాడిన పెట్టేందుకు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో శింతన్​ శిబిర్ నిర్వహించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.