ETV Bharat / bharat

రైతులు నర్వస్ కావద్దు.. రూ.10వేల పరిహారం కోసం వెంటనే జీవో: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Mar 23, 2023, 5:32 PM IST

Updated : Mar 23, 2023, 7:04 PM IST

CM KCR Visited Rain Affected Areas In Telangana: అకాల వర్షాలకు అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మొత్తం 2.28లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు వచ్చాయని సీఎం తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వడగండ్లవానకు పంటలు దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో పర్యటన అనంతరం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

cm kcr
cm kcr

CM KCR Visited Rain Affected Areas In Telangana: పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వడగండ్ల వర్షం వల్ల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. వర్షానికి అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మొత్తం 2.28లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తన దగ్గరకు లెక్కలు వచ్చాయని చెప్పారు. అందులో చాలా మంది రైతులు వందశాతం పంటలు నష్టపోయారన్నారు.

నష్టపోయిన పంటల్లో మొక్కజొన్న ఎక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. వీటితో పాటు వరి, మామిడి, ఇతర పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని.. బీభత్సమైన వర్షాలతో పంటలు అనేక చోట్ల తుడిచిపెట్టుకుపోయాయన్నారు. పంటలు నష్టపోయినప్పుడు రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బతినకుండా ఇండియాలోనే తొలిసారిగా ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కేంద్రానికి గతంలో నివేదికలిచ్చినా పరిహారం ఇవ్వలేదని.. అందుకే ఈసారి నివేదిక కూడా పంపడం లేదని.. రాష్ట్ర ఖజానా నుంచే తామే పరిహారం ఇస్తామని కేసీఆర్ ప్రటించారు. పరిహారం ఎప్పుడో ఇవ్వడం కాదని.. జీవో జారీచేశామని ప్రకటించారు. రైతులు నెర్వస్ కావొద్దని ధైర్యం చెప్పారు.

రాబోయే రోజుల్లో ఇంకా అకాల వర్షాలు పడే ప్రమాదముందన్న కేసీఆర్.. రైతుల వెంటే తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందేలా చూడాలని కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ కరీంనగర్‌లోని చొప్పదండి ప్రాంతాన్ని పరిశీలించిన కేసీఆర్ సమైక్య రాష్ట్ర సమయంలో ఈ ప్రాంతం ఎడారిని తలపించేందని.. ఇప్పుడు పచ్చని మాగాణిగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతుందన్నారు.

యాసంగిలో వరి ధాన్యం సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు బాగా పెరిగాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని సంతోషించారు. ఒక్కసారి వర్షం పడి నష్టం జరిగినా.. ఏం భయం లేదని ఓ రైతు తనతో చెప్పినట్లు వివరించారు. అనంతరం సీఎం హైదరాబాద్‌ బయలుదేరారు.

అంతకు ముందు వడగళ్ల వానకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరిన కేసీఆర్‌ ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలానికి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఈ మండలంలోని రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మొక్కజొన్న, మిర్చి పంటలు, మామిడి తోటలను అణువణువునా పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి చేరుకుని.. తర్వాత కరీంనగర్‌లో తన పర్యటనను ముగించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 23, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.