ETV Bharat / bharat

అమెరికా, బ్రిటన్, రష్యాతో కలిసి భారత్​ 'ఆపరేషన్ అఫ్గాన్'

author img

By

Published : Sep 8, 2021, 7:41 PM IST

MI6, CIA chiefs and Russias Security Council secretary
భారత్​తో అమెరికా, యూకే, రష్యా వరుస భేటీలు

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) ఆక్రమణతో ఉగ్రవాదం, భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. అఫ్గాన్​కు భౌగోళికంగా దగ్గరగా ఉన్న దేశాల్లో చైనా ఇప్పటికే తాలిబన్లకు మద్దతు పలికింది. ఈ క్రమంలో అగ్రరాజ్యాలకు కీలకంగా మారింది భారత్. అఫ్గాన్​ అంశంపై చర్చించేందుకు భారత పర్యటన చేపట్టారు​ అమెరికా, బ్రిటన్​, రష్యా దేశాల నిఘా విభాగం అధినేతలు.

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గత పాలన కంటే భిన్నంగా, సమ్మిళిత సర్కారే ధ్యేయమని, మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని ప్రకటనలు చేసినా.. చివరకు ఐక్యరాజ్య సమితి ఉగ్రజాబితాలో(unsc terror list) ఉన్న వారికే కీలక పదవులు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల ప్రభుత్వంపై(Taliban government) సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. అఫ్గాన్​ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి అగ్రరాజ్యాలు. అఫ్గాన్​కు సమీపంలోని చైనా.. తాలిబన్లకు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో.. భౌగోళికంగా దగ్గరగా ఉన్న భారత్ ఆయా దేశాలకు కీలకంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. బ్రిటన్​, అమెరికా, రష్యాకు చెందిన నిఘా విభాగాల అధినేతలు, ఉన్నతస్థాయి అధికారులు భారత్​ పర్యటన చేపట్టారు. అఫ్గాన్​లో పరిస్థితులు, ప్రాంతీయ భద్రత వంటి విషయాలపై భారత నిఘా విభాగం అధికారులతో చర్చించినట్లు సమాచారం.

ముందు యూకే.. ఆ తర్వాత అమెరికా

యూకే రహస్య నిఘా విభాగం(ఎంఐ6)(UK Secret Intelligence Service) అధినేత రిచర్డ్​ మూరే.. గత వారమే భారత పర్యటన చేపట్టారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, నిఘా విభాగం అధికారులతో సమావేశం అయ్యారు. ఆగస్టు 24న బ్రిటన్​, భారత​ ప్రధానులు బోరిస్​ జాన్సన్​, నరేంద్ర మోదీ ఫోన్​లో చర్చించిన అంశాలకు ఫాలోఅప్​గా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు.. ఉగ్రవాదంపై, తాలిబన్లు వారి హామీలకు కట్టుబడి ఉండకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే.. అఫ్గాన్​లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​ ఉగ్రసంస్థల గురించి భారత్​ లేవనెత్తినట్లు అధికారులు తెలిపారు.

ఆయన తర్వాత.. మంగళవారం అమెరికా సెంట్రల్​ నిఘా ఏజెన్సీ(సీఐఏ)(The Central Intelligence Agency) డైరెక్టర్​ విలియమ్​ బర్న్స్​ భారత్​ చేరుకున్నారు. అజిత్​ డోభాల్​ సహా జాతీయ భద్రతా మండలి సెక్రెటరియేట్ ఉన్నతాధికారులను కలిసి.. అఫ్గాన్​ తాజా పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. విలియమ్ బర్న్స్​ భారత్ పర్యటన తర్వాత... పాకిస్థాన్​కు వెళ్లనున్నట్లు సమాచారం.

రష్యా..

అఫ్గానిస్థాన్​పై ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చల కోసం అజిత్​ డోభాల్​ ఆహ్వానం మేరకు రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌(Russias Security Council secretary) నికోలాయ్‌ పాట్రూషెవ్‌ బుధవారం భారత్​కు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆ తర్వాత వారితో డోభాల్​ భేటీ అయ్యారు.

ఎంఐ6, సీఐఏ, రష్యా భద్రతా విభాగం అధికారులతో సమావేశాల్లో అఫ్గాన్​లో జరుగుతున్న పరిణామాలు, అఫ్గాన్​ భూభాగంలో ఉగ్రవాదానికి అవకాశం వంటి అంశాలు కీలకంగా చర్చకు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయా దేశాలతో భేటీలో తాలిబన్లకు పాకిస్థాన్​ మద్దతుగా నిలవటం, అఫ్గాన్​లో వేలాది మంది పాకిస్థానీ ఫైటర్స్ ఉండటం వంటి అంశాలను భారత్​ ప్రస్తావించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​ విషయంలో భారత్​, రష్యా కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.