ETV Bharat / bharat

మిజోరం, ఛత్తీస్​గఢ్​లో ముగిసిన ఓటింగ్- పోలింగ్ ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 7:02 AM IST

Updated : Nov 7, 2023, 5:13 PM IST

Mizoram Election 2023
Chhattisgarh Election 2023

17:08 November 07

నక్సల్​ ప్రభావిత బస్తర్​లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు ముగిసాాయి. సుమారు 60శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

16:04 November 07

మిజోరం అసెంబ్లీలోని 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఛత్తీస్​గఢ్​లో 10 స్థానాలకు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్​ పూర్తైంది.

14:05 November 07

మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.73 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 60.37 శాతం ఓటింగ్ నమోదైంది.
మరోవైపు, ఛత్తీస్​గఢ్​లో ఒంటిగంట వరకు 44.55 శాతం మంది ఓటేశారు.

12:50 November 07

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు.. బండ పోలింగ్​ స్టేషన్​పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. మావోలు, పోలీసుల మధ్య పది నిమిషాల పాటు ఎన్​కౌంటర్​ జరిగినట్లు అధికారులు తెలిపారు.

12:36 November 07

మిజోరంలో ఉదయం 11 గంటల వరకు 32.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

11:35 November 07

ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్​గఢ్, మిజోరంలో ఓటింగ్ పుంజుకుంటోంది. ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఛత్తీస్​గఢ్​లో ఉదయం 11 గంటల వరకు 22.97 శాతం ఓటింగ్ నమోదైంది.

11:05 November 07

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9గంటల వరకు 17.28 ఓటింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

10:17 November 07

'మావోల ప్రభావిత ప్రాంతాల్లో అధిక ఓటింగ్​ శాతం'
కాంగ్రెస్​ పార్టీ ఎల్లప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతుందని ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్​ బఘేల్​ తెలిపారు. అందుకు కాంగ్రెస్​ మ్యానిఫెస్టోలోని హామీలే నిదర్శనమని చెప్పారు. ఐదేళ్లలో తాము చేపట్టిన చర్యలతో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేశామని.. ప్రజలు తమ గ్రామాల్లోనే ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. మూవోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్​ శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

10:17 November 07

మిజోరం ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంథంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు. అయిజాల్ నార్త్-2 అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఓటేయడానికి ఉదయమే ఆయన పోలింగ్ బూత్​కు వచ్చినప్పటికీ.. ఈవీఎంలో సాంకేతిక లోపాల వల్ల వెనుదిరగాల్సి వచ్చింది.

09:51 November 07

ఛత్తీస్​గఢ్​ ఎన్నికల్లో ఉదయం 9 గంటల నాటికి 9.93 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు, మిజోరంలో ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఉదయం 9 నాటికి 12.80 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

08:36 November 07

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓటేశారు. అయిజాల్​లోని సౌత్-2 పోలింగ్ స్టేషన్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

08:22 November 07

ప్రధాని మోదీ ట్వీట్​..
ఛత్తీస్​గఢ్​, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓట్ల పండుగలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. తొలిసారిగా ఓటేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

"మిజోరాం ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నాను. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను" అని మిజోరాం ప్రజల ఉద్దేశించి మోదీ ట్వీట్​ చేశారు.
"ఛత్తీస్​గఢ్​​లో నేడు పవిత్రమైన ప్రజాస్వామ్య పండుగ రోజు. తొలి దశ పోలింగ్​లో ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసి ఈ పండుగలో భాగస్వాములు కావాలి. తొలిసారి ఓటు వేసిన యువతకు ప్రత్యేక అభినందనలు" అని ఛత్తీస్​గఢ్​ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని ట్వీట్​ చేశారు.

08:09 November 07

మిజోరం కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్​సవ్తా ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయిజాల్​లోని మిషన్ వెంగ్​త్లాంగ్​ పోలింగ్ బూత్​లో ఓటేశారు.

07:43 November 07

రెచ్చిపోయిన నక్సల్స్...
ఛత్తీస్​గఢ్​లో ఎన్నికల వేళ నక్సల్స్ రెచ్చిపోయారు. నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలడం వల్ల ఓ సీఆర్​పీఎఫ్ కోబ్రా జవాను గాయపడ్డాడు. సుక్మా జిల్లాలోని తొండమర్క ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ జవాను ఎన్నికల విధుల్లో ఉన్నాడని సుక్మా ఎస్​పీ కిరణ్ చవాన్ తెలిపారు.

07:19 November 07

మిజోరం సీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) అధినేత జొరాంథంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈవీఎం మొరాయించడం వల్ల పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

06:24 November 07

ఛత్తీస్​గఢ్​, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు- 2023

Chhattisgarh Election 2023 : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు.. సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. రాబోయే ఐదేళ్లకు తమ నుదుటి రాతను రాసుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌, మిజోరం ఓటర్లు సిద్ధమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లోని పలు నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 12 స్థానాలు.. బస్తర్‌ డివిజన్‌లో ఉన్నాయి. వీటిలో సమస్యాత్మక అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపుర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. బస్తర్, జగదల్‌పుర్, చిత్రకోట్‌లలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరగనుంది. 20 స్థానాల్లో మొత్తం 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 40 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

Mizoram Election 2023 : మరోవైపు, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 40స్థానాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 8 లక్షలకు పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలివిడతలో 20 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కించనున్నారు. మిజోరంలోని 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుండగా.. డిసెంబర్ 3నే ఓట్ల లెక్కింపు జరగనుంది.

Last Updated : Nov 7, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.