గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భీకర వానలకు తమిళనాడులోని కొన్ని జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పలు చోట్ల దుకాణాలు తెరుచుకున్నాయి. వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
చెన్నై సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. లోతట్టు ప్రదేశాల్లో నిలిచిన వరద నీటిని నీటి ఇంజిన్ల సాయంతో బయటకు తోడుతున్నారు. భీకర గాలుల ధాటికి రహదారులపై విరిగి పడిన చెట్లను తొలగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
వర్ష బీభత్సానికి.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగు నీరు, విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మదురైలోని వైగై డ్యామ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల నీటిమట్టం 69 అడుగులకు (పూర్తి సామర్థ్యం 71 అడుగులు) చేరుకుంది. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అక్కడక్కడ శుక్రవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవీ చూడండి:
తీరం దాటిన వాయుగుండం.. జలదిగ్బంధంలో చెన్నై