ETV Bharat / bharat

నిందితుడికి బెయిల్​ ఇవ్వాలా..? వద్దా..? చాట్​జీపీటీ సాయం కోరిన హైకోర్టు జడ్జి

author img

By

Published : Mar 28, 2023, 7:09 PM IST

Updated : Mar 28, 2023, 7:34 PM IST

కృత్రిమ మేధ సంచలనం చాట్​జీపీటీ దేశ న్యాయవ్యవస్థలో కూడా పాలుపంచుకుంటోంది. ఓ నిందితుడి కేసు విషయంలో పంజాబ్​-హరియాణా హైకోర్టు జడ్జి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఇంతకీ చాట్​జీపీటీ ఇచ్చిన సలహా ఎంటో తెలుసుకుందాం

chatgpt in punjab haryana high court news
పంజాబ్​ హరియాణా హైకోర్టులో చాట్​జీపీటీ

ఆర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్​(ఏఐ) సంచలనం చాట్​జీపీటీ రోజురోజుకి మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్​ పరీక్షలతో పాటు లా, ఎంబీఏ పరీక్షలను రాసి కొన్నిట్లో మెరుగైన ఫలితాలు సాధించి ఔరా అనిపించింది. ఇక తాజాగా పంజాబ్​-హరియాణా హైకోర్టుకు సైతం న్యాయ సలహా అందించింది. ఓ క్రైమ్​ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో చాట్​జీపీటీ సూచనలను అడిగి తెలుసుకున్నారు జడ్డీలు. బహుశా భారతీయ న్యాయవ్యవస్థలోనే ఈ సంఘటన మొదటిది కావచ్చు. ఇంతకీ చాట్​జీపీటీని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్న ఏంటి.. దీనికి ఏఐ ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.

దుండగులు క్రూరత్వంతో ఇతరులపై దాడి చేసినప్పుడు.. అతడి బెయిల్‌ అభ్యర్థనపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి? అని అడిగారు జడ్దిలు. దీనికి చాట్​జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనిషి చంపుతున్నారు కాబట్టి బెయిల్​ పిటిషన్​ను తిరస్కరిస్తాను అని చాట్​జీపీటీ బదులిచ్చింది. ఓ దుండగుడు క్రూరత్వంతో ఓ వ్యక్తిపై శారీరక దాడి చేస్తే గనుక దాని తీవ్రతను బట్టి బెయిల్​ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతాయని చాట్​జీపీటీ వివరించింది. నేరంలో ఉండే క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిల్​ మంజూరు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుందని ఏఐ చెప్పింది. క్రూరత్వంతో వ్యవహరించే వ్యక్తుల ప్రభావం బాధితులపైనే కాకుండా సమాజానికి ప్రమాదకరమేనని చాట్​జీపీటీ అభిప్రాయపడింది. దుండగుడి దాడి తీవ్రత, నిందితుడి నేర చరిత్ర, వీరికి వ్యతిరేకంగా దాఖలయ్యే సాక్ష్యాల బలం వంటి అంశాలు అతడికి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయని చాట్​జీపీటీ బదులిచ్చింది. మొత్తంగా నిందితుడు చేసే క్రూరమైన చర్య ఆధారంగా చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్ష విధించడమో లేదా ఊరట కలిగించడమో చేయవచ్చని చాట్​జీపీటీ సమాధానం ఇచ్చింది. అలాగే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ప్రతివాది వద్ద బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప అతడు బెయిల్​కు పిటిషన్​కు అర్హుడు కాడని చెప్పింది. అయితే నిందితుడి నేర ప్రవృత్తి, సత్ప్రవర్తనని న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకొని బెయిల్​ మంజూరు చేయవచ్చని చాట్​జీపీటీ సూచించింది.

అయితే న్యాయశాస్త్రంపై చాట్​జీపీటీకి ఏ మేరకు అవగాహన ఉందో అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రయోగం చేశామని న్యాయమూర్తులు వెల్లడించారు. కాగా, చాట్​జీపీటీ ఇచ్చే సమాచారం, సూచనలు లేదా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని తీర్పులను వెలువరించరాదని జస్టిస్​ అనూప్​ చిట్కారా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇక కేసు విషయానికి వస్తే పంజాబ్​కు చెందిన నిందితుడిపై 2020 జూన్​లో లూథియానా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో హత్యతో పాటు ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇదే కేసులో తమ క్లైంట్​ బెయిల్‌కు అర్హుడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి గతాన్ని బట్టి అతడు బెయిల్‌పై విడుదలయ్యాక భవిష్యత్​లో మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని న్యాయమూర్తులు బెయిల్​ అభ్యర్థనను తిరస్కరించారు.

Last Updated :Mar 28, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.