ఇంటికి తాళం.. వరుడు, ఇద్దరు మహిళలు సజీవదహనం.. ఏం జరిగింది?

author img

By

Published : May 27, 2023, 12:59 PM IST

Charred bodies of sisters, brother recovered in West Bengal

వివాహబంధంలోకి మరికొద్ది రోజుల్లో అడుగుపెట్టాల్సిన ఓ యువకుడు, అతడి ఇద్దరు సోదరీమణులు అనుమానస్పద రీతిలో సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే?

మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో సజీవదహనమయ్యారు. బంగాల్​లోని దుర్గాపుర్​లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ విషాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మంగళ్ సోరెన్ (33), సుమీ సోరెన్ (35), బహమనీ సోరెన్ (23)గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. దుర్గాపుర్​ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్​ కుమారుడు మంగళ్​ సోరన్​కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫున కుటుంబసభ్యులు మంగళ్​ ఇంటికి వచ్చి వివాహానికి ముహుర్తం ఖరారు చేయాల్సి ఉంది. అందుకు మంగళ్ సోదరమణులు సుమీ, బహమనీ.. శుక్రవారం పుట్టింటికి వచ్చారు. సుమీ సోరెన్​ కోల్​కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బమమనీ గృహిణి. అయితే వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదోపని మీద మార్కెట్​కు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు.

వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన కాలిన గాయాలతో మంగళ్ సోరెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి సోదరీమణులను దుర్గాపుర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వివాహం జరిగాల్సిన ఇంట్లో ఈ ఘటన జరగడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

హఫ్నా ఇంట్లో జరిగిన ఈ విషాద ఘటనపై స్థానికంగా నివాసం ఉండే సుందరీ ముర్ము స్పందించారు. "హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంటారు. మంగళ్ సోదరి కోల్‌కతాలో పని చేస్తుంది. తన సోదరుడి పెళ్లి కోసం వచ్చింది. ఆమె తన సోదరుడి వివాహం అయ్యే వరకు సెలవు తీసుకున్నానని చెప్పింది. అసలేం జరిగిందో తెలియట్లేదు" అని చెప్పారు.

మద్యం మత్తులో స్నేహితుడి హత్య..
మహారాష్ట్ర.. ఠాణెలో మద్యం మత్తులో స్నేహితుడిని చంపేశాడు ఓ వ్యక్తి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. మృతుడిని రాజ్​భర్​గా గుర్తించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రాబోడి పాంత్రంలో రాజ్​భర్​, నిందితుడు నివసిస్తున్నారు. మే24 మధ్యాహ్నం.. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. అనంతరం మద్యం తాగారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహాంతో నిందితుడు.. రాయితో రాజ్​భర్​ తలపై దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. రాజ్​భర్​ మృతిచెందిన తర్వాత నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.