ETV Bharat / bharat

Chandrababu Quash Petition in SC Adjourned: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ.. 17కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 4:23 PM IST

Updated : Oct 13, 2023, 8:21 PM IST

Chandrababu Quash Petition in SC Adjourned: స్కిల్ డెవలప్​మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది. చంద్రబాబు తరపున లూథ్రా, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 17A కేంద్రంగా వాదనలు కొనసాగాయి.

chandrababu_quash_petition_in_sc_adjourned
chandrababu_quash_petition_in_sc_adjourned

Chandrababu Quash Petition in SC adjourned till Tuesday : స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​పై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. తొలుత స్కిల్ కేసు విచారణకు ఫైబర్ నెట్ కేసుతో సంబంధం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించారు. మరో కేసులో చంద్రబాబును ఈ నెల 16న ప్రవేశపెట్టేందుకు వారెంట్ తీసుకున్నారన్నారు. కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్ ఆడిస్తున్నారంటూ లూథ్రా వ్యాఖ్యానించారు. ఇక్కడ కూడా 17ఏ ను ఛాలెంజ్ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. అవును అని సమాధానమిచ్చిన లూథ్రా 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రస్తావించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు అదే చట్టం వర్తిస్తుందన్నారు. చట్టాన్ని రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పుడు చట్టమే వర్తిస్తుందని వాదించారు. కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదన్నారు.

Chandrababu's health in jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన

పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తారు: అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్‌ చేస్తారని జస్టిస్‌ బోస్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. పోలీసు అధికారికి కేసు నమోదు చేసే అధికారమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్పందించిన రోహత్గీ అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా అన్నారు. అవినీతికి పాల్పడినప్పుడు చట్ట నిబంధనలు వర్తించవు కదా అని వ్యాఖ్యానించారు. అధికార విధుల నిర్వహణ ముసుగులో అవినీతికి పాల్పడే పరిస్థితి ఉండకూడదు కదా అన్నారు. అయితే చట్ట సవరణ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేశారు.. కేసు పాతదే అంటారు.. అంతేనా? అని జస్టిస్‌ త్రివేది ప్రశ్నించారు. చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని తన వాదనని రోహత్గీ వాదించారు. 17ఏ అనేది పుట్టకముందే నేరం జరిగింది కాబట్టి ఈ కేసుకు చట్టసవరణ వర్తించదన్నారు. 2018 జులైలో చట్టసవరణ జరిగిందన్న రోహత్గీ.. 2014, 2015 కేసులకు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద పరిగణించలేము కదా? అని అన్నారు.

TDP Leaders Worried About Chandrababu Health : చంద్రబాబు ప్రాణాలకు ముప్పు.. వైద్యులపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి : టీడీపీ నేతల ఆందోళన

పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి: 17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదని ముకుల్‌ రోహత్గీ వ్యాఖ్యానించారు. అవినీతిపరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదని పేర్కొన్నారు. సెక్షన్‌ 19 మాదిరిగా 17ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు నిరోధం కల్పించలేదన్న రోహత్గీ.. ఈ చట్టం వచ్చింది... నిజాయతీపరులైన అధికారులకు భవిష్యత్తుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసమేనన్నారు. పోలీసు కేసు పెట్టగానే వెంటనే హైకోర్టుకు వెళ్లారు.. ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చారని రోహత్గీ వ్యాఖ్యానించారు. కనీసం పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడిందన్న రోహత్గీ.. వరుసగా కోర్టు తర్వాత మరో కోర్టుకు రావడం మూలంగా పోలీసు విచారణకు విఘాతం కలుగుతుందన్నారు. కనీసం పోలీసులకు విచారణ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా అని వాదించారు. పిటిషనర్‌ తన ప్రమేయం లేదంటున్నారు.. ఎస్‌ఎల్‌పీ మీద మీరేమంటారు? అని జస్టిస్‌ బోస్‌ రోహత్గీని ప్రశ్నించారు. స్పందించిన రోహత్గీ... నేరమే చేయనప్పుడు ఎస్‌ఎల్‌పీ ఎందుకు వేశారన్నారు. అధికార విధుల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని పిటిషనర్‌ అన్నప్పుడు 17ఏ వర్తిస్తుందన్నారు. నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17ఏ ఎలా వర్తిస్తుంది అని రోహత్గీ వాదించారు.

Anticipatory Bail for Chandrababu in Angallu Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

అజ్ఞాత వేగు ద్వారా ప్రభుత్వానికి సమాచారం: 2018 మే 14, జూన్‌ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచామని రోహత్గీ తెలిపారు. ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్లు హైకోర్టుకు నివేదించామన్నారు. తమ వాదనలను ఏపీ హైకోర్టు ఆమోదించిందని రోహత్గీ తెలిపారు. ఈ కేసులో ఒక అజ్ఞాత వేగు ద్వారా ప్రభుత్వానికి ఈ సమాచారం వచ్చిందన్న రోహత్గీ.. దాని ఆధారంగా కేసు విచారణ ప్రారంభమైందన్నారు.17ఏ అన్నది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ ఛత్రం కాకూడదన్న రోహత్గీ... చట్టం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుందన్నారు. విధాన నిర్ణయాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం అవినీతికి పాల్పడితే దానికి 17ఏను వర్తింపచేయలేమన్నారు. సెక్షన్‌ 19 అయినా... 17ఏ అయినా రక్షణ ఛత్రం కాకూడదన్నదే తాను కోర్టు ముందు ఉంచుతున్న వాదన అని రోహత్గీ వ్యాఖ్యానించారు.

CID Officers Call Data Record Case: సీఐడీ అధికారుల కాల్‍డేటా ఇవ్వాలన్న పిటిషన్‍పై విచారణ ఈనెల 18కి వాయిదా

పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు: హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు ముందుంచారు. క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లోని అంశాలను సుప్రీంకోర్టు ముందు రోహత్గీ ఉంచారు. ప్రభుత్వ విభాగాల సూచనలను పక్కనపెట్టి డిజైన్‌టెక్‌ కంపెనీకి నిధులు మంజూరు చేశారన్న రోహత్గీ ఆ కంపెనీకి ఇచ్చిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా సొంత మనుషులకు వచ్చేలా అప్పటి సీఎం వ్యవహరించారన్నారు. డిజైన్‌ టెక్‌ ఇచ్చిన నిధుల నుంచి మొత్తం సొమ్ముకానీ.. కొంత మొత్తం కాని షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిందన్నారు. ఈ మొత్తమంతా నగదు రూపంలో 2, 3 కంపెనీలకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయన్న రోహత్గీ... ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలున్నందునే దీనిని 17ఏ కింద పరిగణించకూడదన్నారు. ముకుల్‌ రోహత్గీ వాదనల అనంతరం చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో తిరిగి విచారణ జరగనుంది.

ఫైబర్‌ నెట్‌ కేసులో... ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో కూడా 17ఏ ప్రస్తావన ఉందని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వ్యాఖ్యానించగా.. మంగళవారానికి వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించారు. సోమవారం నాడు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారని లూథ్రా అన్నారు. సోమవారం హాజరుపరిచాక ముందస్తు బెయిల్‌ అన్న పదమే ఉత్పన్నం కాదన్నారు. మేం ఆర్డర్‌ పాస్‌ చేయట్లేదు గానీ.. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని చెప్పండి అని జస్టిస్‌ బోస్‌ వ్యాఖ్యానించారు. సోమవారం రోజు అరెస్టు చేయవద్దని సమాచారం అందజేస్తా అని రోహత్గీ వెల్లడించారు. అరెస్టు చేయకపోతే ముందస్తు బెయిల్‌ నిరర్ధకం కాదని, ఏసీబీ కోర్టులో ఫైబర్‌ నెట్‌ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారమిస్తానని రోహత్గీ తెలిపారు.

Lokesh Comments: చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు.. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉంటుంది: లోకేశ్​

అప్పటివరకు చంద్రబాబు అరెస్ట్​ వద్దు: ఫైబర్‌ నెట్‌ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 17వ తేదీకి వాయిదా పడింది. ఫైబర్‌ నెట్‌ కేసులోనూ 17ఏ ప్రస్తావన ఉందని.. 17ఏ పై వాదనలు పూర్తి కానుందన ఫైబర్‌ నెట్‌ కేసులో ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అనిరుద్ధబోస్ వ్యాఖ్యానించారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను 17వ తేదీకి వాయిదా వేయడం వల్ల ప్రయోజనం లేదని.. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబును 16వ తేదీ.. కోర్టు ముందు హాజరుపరుస్తున్నారని తెలిపారు. 16వ తేదీ కోర్టులో హాజరుపరిచాక.. ముందస్తు బెయిల్‌ అన్న పదమే ఉత్పన్నం కాదని లూథ్రా వాదించారు. అయితే తాము ఆర్డర్‌ పాస్‌ చేయట్లేదుగానీ.. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని చెప్పాలని.. ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గీకి ధర్మాసనం సూచించింది. ఏసీబీ కోర్టులో ఫైబర్‌ నెట్‌ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారమిస్తానని రోహత్గీ కోర్టుకు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయకపోతే ముందస్తు బెయిల్‌ నిరర్ధకం కాదని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వ్యాఖ్యానించారు..

Last Updated : Oct 13, 2023, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.