ETV Bharat / bharat

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ - ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో సీజేఐ ముందుకు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 6:57 AM IST

Chandrababu Quash Petition: స్కిల్ డెవలప్​మెంట్​ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. దీంతో కేసును సీజేఐకి నివేదించాలని, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్ బేలా ఎం. త్రివేది ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. ఫలితంగా క్వాష్‌ పిటిషన్‌ విచారణ విస్తృత ధర్మాసనం ముందుకు రానుంది. నిందితుడికి రిమాండు ఉత్తర్వులు కొట్టేయడానికి ఇద్దరు న్యాయమూర్తులు నిరాకరించారు.

chandrababu_quash_petition
chandrababu_quash_petition

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ - ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో సీజేఐ ముందుకు

Chandrababu Quash Petition: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం - 1988లోని సెక్షన్‌ - 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ బోస్‌ స్పష్టం చేశారు. లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయన్నారు.

17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు, ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు. సెక్షన్‌-17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రిమాండు ఉత్తర్వులు కొట్టేయడానికి ఇద్దరు న్యాయమూర్తుల నిరాకరించారు.

స్కిల్‌ డెవలప్​మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ గత ఏడాది సెప్టెంబరు 9న కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు సెప్టెంబర్‌ 22న ఆ పిటిషన్ను కొట్టివేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ ఆ మరుసటి రోజు చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టి గత ఏడాది అక్టోబర్‌ 17న తీర్పు వాయిదా వేసిన జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం మంగళవారం ఆ తీర్పును వెలువరించింది.

నిమ్మకూరులో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి - ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు

తొలుత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధబోస్‌ తీర్పు వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం - 1988లోని నేరాల కింద ప్రభుత్వ ఉద్యోగిపై నమోదు చేసిన కేసుల్లో విధి నిర్వహణలో భాగంగా సదరు వ్యక్తి తీసుకున్న నిర్ణయాలపై విచారణ, దర్యాప్తు చేపట్టేటప్పుడు సెక్షన్‌ 17-ఎ అమల్లోకి వచ్చిన తర్వాత అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ అలా తీసుకోకపోతే అవినీతి నిరోధక చట్టం -1988 కింద చేపట్టిన విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని తేల్చిచెప్పారు.

ప్రస్తుత కేసులో అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(సి), 13(1)(డి) రెడ్‌ విత్‌ 13(2) కింద నమోదు చేసిన కేసుల తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఇప్పుడైనా 17-ఎ కింద అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని సూచించారు. ఈ ఉత్తర్వులు దానికేమీ అడ్డంకి కావని స్పష్టం చేశారు. అందువల్ల ఆ సెక్షన్‌ ప్రకారం అనుమతి తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పటికీ స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుపై హైకోర్టు న్యాయవాదులు ఏమన్నారంటే ?

సెప్టెంబరు 10న దిగువ కోర్టు ఇచ్చిన రిమాండు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం-1988 కింద పేర్కొన్న నేరాలు ఆ దశలో వర్తింపజేయడానికి వీలు లేకపోయినా, రిమాండు ఉత్తర్వులు జారీచేసే న్యాయపరిధి దిగువ కోర్టుకు ఉందన్నారు. 17-ఎ కింద అనుమతి తీసుకోలేదని రిమాండు చెల్లదని చెప్పలేమన్నారు. ఇందులో ఐపీసీ-1860 కింద నమోదైన కేసుల విచారణను దిగువకోర్టు కొనసాగించవచ్చని పేర్కొంటూ, చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధబోస్‌ చెప్పారు.

జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ అభిప్రాయాలతో జస్టిస్ బేలా ఎం. త్రివేది విభేదించారు. తన అభిప్రాయం ప్రకారం 17-A అన్నది అవినీతి నిరోధక చట్టం కింద సవరించిన, కొత్తగా చేర్చిన నేరాలకో వర్తిస్తుందని చెప్పారు. 2018లో ఈ చట్టానికి సవరణలు చేసినట్లు గుర్తుచేశారు. విస్తృత శాసన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2018లో ఓ సవరణ ద్వారా 17-Aని ప్రవేశపెట్టారని చెప్పారు. అది 2018 జులై 26 నుంచి అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. అందువల్ల ఆ సవరణ అంతకుముందు నుంచి వర్తించదన్నారు.

వైఎస్సార్​సీపీ నేతలు అక్రమాలతో దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని పన్నాగం : చంద్రబాబు

2018 నాటి సవరణ విషయంలో చట్టం నుంచి తొలగించిన 13 ‍(1)(సి), 13(1)(డి) సెక్షన్‌ల కింద నమోదైన నేరాలకు పాత తేదీల నుంచి సెక్షన్‌ 17-Aను వర్తింపజేయకూడదని జస్టిస్ బేలా ఎం.త్రివేది వివరించారు. ఈ సెక్షన్‌ 2018లో సవరించిన చట్టంలోని కొత్త నేరాలకే వర్తిస్తుందని పేర్కొన్నారు. చట్టం నుంచి తొలగించిన నేరాలకు ముందస్తు అనుమతులు అవసరం లేదన్నారు. 17-A అన్నది అంతకుముందున్న నేరాలకూ వర్తిస్తుందన్న హరీశ్‌సాల్వే వాదనలను అంగీకరిస్తే 2018 జులై 26కి ముందున్న నిబంధనల ప్రకారం విచారణ చేపట్టిన పెండింగ్‌ కేసులన్నీ నిరర్థకమవుతాయని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో భాగంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిజాయతీగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించడం 17-A ప్రధాన ఉద్దేశం తప్పితే, అవినీతిపరులకు లబ్ధి కల్పించే పరికరంగా దాన్ని మార్చడం సరికాదని, జస్టిస్ బేలా ఎం. త్రివేది వ్యాఖ్యానించారు. సెక్షన్‌ 17-Aని పాత తేదీల నుంచి వర్తింపజేసి ప్రభుత్వ ఉద్యోగి చేసిన నేరంపై పోలీసు అధికారులు చేపట్టిన దర్యాప్తును పక్కనపెట్టినా, నిరర్థకం అని ప్రకటించినా అది అవినీతి నిరోధక చట్టం ఉద్దేశాలను దెబ్బతీయడమే కాకుండా, ప్రతికూల ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు.

చంద్రబాబు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా నా కుమారుడు విజయ్: అయ్యన్నపాత్రుడు

17-A కింద ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన, ప్రభుత్వ ఉద్యోగి తనపై ఉన్న ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయడానికి గానీ, తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలనడానికి గానీ ప్రాతిపదిక కాదన్నారు. పైగా సదరు ప్రభుత్వ ఉద్యోగిపై అదే ఆరోపణల మీద IPC కింద కూడా కేసు నమోదై ఉంటుందని చెప్పారు. నమోదైన కేసు విధి నిర్వహణలో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించింది కాదని ప్రాథమికంగా భావించినప్పుడు, ఈ సెక్షన్‌ను వర్తింపజేయలేమని తేల్చిచెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(సి), 13(1)(డి)ల రద్దు దర్యాప్తు సంస్థల అధికారాలను ప్రభావితం చేయలేదని జస్టిస్‌ బేలా ఎం. త్రివేది స్పష్టం చేశారు.

17-A సెక్షన్‌ కింద ముందస్తు అనుమతి తీసుకోకపోయినా అది అప్పటివరకు చేపట్టిన ప్రొసీడింగ్స్‌ను తప్పుబట్టలేదని పేర్కొన్నారు. నిందితుడిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడానికి అది ప్రాతిపదిక కాదన్నారు. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీలోని ఇతర నేరాల కింద కేసు నమోదైందని అందువల్ల ప్రత్యేక న్యాయస్థానం తనకున్న పరిధిలోనే రిమాండు ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టు జ్యురిస్‌డిక్షనల్‌ తప్పుచేయలేదన్నారు. హైకోర్టు తీర్పు కూడా అస్పష్టంగా, చట్టవిరుద్ధంగా లేదు కాబట్టి అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఈ కోర్టుకు కలగలేదని పేర్కొంటూ, చంద్రబాబు దాఖలు చేసిన కేసు కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.

'కేశినేని నాని వైసీపీ కోవర్ట్' - 'చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శించే స్థాయి లేదు'

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aని వర్తింపజేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో, ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని న్యాయమూర్తులు ఇద్దరూ నిర్ణయించారు. ఈ సెక్షన్‌కు భాష్యం చెప్పడం, దాన్ని అప్పీలుదారుకు వర్తింపజేయడంలో తాము ఇద్దరమూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందున తదుపరి, తగిన ఉత్తర్వుల కోసం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదిస్తున్నట్లు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ పేర్కొన్నారు.

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు విచారణ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రానుంది. అందులోని అంశాలు 17-A సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. మంగళవారం సెక్షన్‌ 17-A పై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

పేదల కోసమే ఉచిత ఇసుక విధానం - చంద్రబాబు లబ్ది పొందారనే దానిపై ఆధారాలేవి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.