ETV Bharat / bharat

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. మళ్లీ అమ్మాయిలే టాప్​!

author img

By

Published : May 12, 2023, 11:23 AM IST

Updated : May 12, 2023, 2:21 PM IST

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12 తరగతు ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది.

CBSE 12th result 2023
CBSE 12th result 2023

CBSE 12th result 2023 : విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల ఫలితాలు వచ్చేశాయ్‌. శుక్రవారం ఉదయం 12వ తరగతి, మధ్యాహ్నం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది బోర్డు. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్లు, స్కూల్‌ నంబర్లతో డిజిలాకర్‌, పరీక్షా సంగమ్‌ నుంచి కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ సారి కూడా మెరిట్ కార్డులను ప్రకటించలేదు బోర్డు. విద్యార్థుల మధ్య ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో.. మెరిట్​ లిస్టులను ప్రకటించడం లేదని వివరించింది. రెండు తరగతుల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు.

12వ తరగతిలో 87.33 శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది 12 వ తరగతిలో మొత్తం 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు తెలిపింది. 99.91 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం అగ్రస్థానంలో నిలవగా.. ప్రయాగ్ రాజ్​లో అత్యల్పంగా 78.05శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొంది. వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 5.38 శాతం ఉత్తీర్ణత తగ్గిందని చెప్పింది. 90.68 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారని.. అబ్బాయిల కంటే 6.01 శాతం అధికమని పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు హాజరయ్యారు.

10వ తరగతిలో 93.12 శాతం ఉత్తీర్ణత
శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 93.12 శాతం మంది విద్యార్థులు పాస్​ అయ్యారు. గతేడాది కంటే ఇది 1.28 శాతం తక్కువని సీబీఎస్​ఈ తెలిపింది. అబ్బాయిలపై మరోసారి పైచేయి సాధించారు అమ్మాయిలు. అబ్బాయిలు 92.27 శాతం సాధించగా.. అమ్మాయిలు 94.25 శాతంతో మెరుగైన ఫలితాలు సాధించారు. మరోవైపు వచ్చే ఏడాది జరగబోయే 10,12 తరగతులు పరీక్షల షెడ్యూల్​ను ప్రకటించింది సీబీఎస్​ఈ. 2024 ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఎగ్జామ్​ కంట్రోలర్​ సన్యం భరద్వాజ్​ తెలిపారు.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి.

  • సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • యాక్టివ్‌ రిజల్ట్స్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.
  • కొత్త పేజీ డిస్‌ప్లే అవుతుంది.
  • మీ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.
  • మీరు సాధించిన స్కోరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఆ కాపీని ప్రింట్‌ తీసి భద్రపరుచుకోండి.

కంపార్ట్​మెంట్​ ఇకపై సప్లిమెంటరీ
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం కంపార్ట్​మెంట్​ పరీక్ష పేరును సప్లిమెంటరీగా మార్చింది సెంట్రల్​ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​. దీంతోపాటు విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పింది. 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో రెండు సబ్జెక్టులు, 12వ తరగతి విద్యార్థులు ఒక సబ్జెక్టును మార్కులను పెంచుకునేందుకు రాయవచ్చని చెప్పింది. ఈ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో నిర్వహిస్తామని.. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.

తెలంగాణలో గణనీయంగా పెరిగిన సీబీఎస్​ఈ స్కూల్స్​
మరోవైపు తెలంగాణలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) అనుబంధ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు సంవత్సరాల్లోనే వీటి సంఖ్య దాదాపు రెట్టింపయింది. తమ పిల్లల్ని పాఠశాల విద్య వరకు సీబీఎస్‌ఈ బడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో మొత్తం 250 పాఠశాలలు ఉండగా.. అందులో ప్రైవేట్‌వి 210 ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం బడుల సంఖ్య ఏకంగా 479కి చేరుకోగా.. అందులో ప్రైవేట్‌ పాఠశాలలే 410 ఉండటం విశేషం. అంటే ఆరేళ్లలో ప్రైవేట్‌ పాఠశాలలు 95 శాతం పెరిగాయి. మొత్తం పాఠశాలలను పరిగణనలోకి తీసుకుంటే 92 శాతం పెరుగుదల నమోదైందని తాజా సీబీఎస్‌ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

ఇవీ చదవండి : ఆరేళ్లుగా గుంతలోనే నివాసం.. తాగునీటికి కష్టం.. ప్రభుత్వ పథకాలకు దూరం

టెన్త్ పరీక్షల్లో 7వ తరగతి అమ్మాయికి 90% మార్కులు.. UPSC టాపర్​ అవ్వడమే టార్గెట్​!

Last Updated :May 12, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.