ETV Bharat / bharat

బోర్డర్​లో 'టిఫిన్​ బాక్స్​ బాంబుల' కలకలం- అసలేం జరుగుతోంది?

author img

By

Published : Nov 5, 2021, 3:51 PM IST

tiffin bombs in punjab
పంజాబ్​లో 'టిఫిన్​ బాక్స్​ బాంబుల' కలకలం- అసలేం జరుగుతోంది?

పంజాబ్​లో బయటపడ్డ మరో టిఫిన్​ బాక్స్​ బాంబు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇప్పటికే ఈ తరహా ఘటనలు పెరిగిపోతుండగా.. తాజాగా ఫిరోజ్​పుర్​ జిల్లాలో మరో టిఫిన్​ బాక్స్​ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్​లో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించాలని మాజీ సీఎం అమరీందర్​ సింగ్​ హితవు పలికారు.

పంజాబ్​లో టిఫిన్​ బాక్స్​ బాంబుల వ్యవహారం కలకలం రేపుతోంది. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్​లో ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం వల్ల జాతీయ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని ఫిరోజ్​పుర్​ జిల్లాలో టిఫిన్​ బాక్స్​ బాంబు బయటపడటం రాజకీయ దుమారానికి దారితీసింది.

అసలేం జరిగింది?

దీపావళికి ఒక్క రోజుముందు, అంటే బుధవారం భారత్​- పాకిస్థాన్​ సరిహద్దులోని ఫిరోజ్​పుర్​లో టిఫిన్​ బాక్స్​ బాంబు బయటపడింది. అలి కే గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దీనిని పోలీసులు గుర్తించారు. తొలుత.. జలాలాబాద్​ పేలుళ్ల కేసులో అరెస్ట్​ అయిన ముగ్గురు నిందితుల నుంచి ఓ టిఫిన్​ బాక్స్​ బాంబు, పెన్​డ్రైవ్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా.. మరో టిఫిన్​ బాక్సు బాంబు.. అలి కే గ్రామంలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడి వెళ్లి దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇది కొత్త కాదు!

సెప్టెంబర్​లో జలాలాబాద్​లోని పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమృత్​సర్​, కపూర్తలా, ఫాజిల్కా, తర్న్​ తరన్​ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి టిఫిన్​ బాక్స్​ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు.. అమృత్​సర్​ ప్రాంతంలో ఐఈడీతో కూడిన టిఫిన్​ బాక్స్​ బాంబును స్వాధీనం చేసుకుని భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. టిఫిన్​ బాక్స్​లో 2-5కేజీల ఐఈడీ ఉందని, డ్రోన్లతో వాటిని పాకిస్థాన్ సరఫరా చేసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.​ స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన వెలుగుచూడటం కలకలం రేపింది.

అమరీందర్​ సింగ్​ ఫైర్​..

టిఫిన్​ బాక్స్​ బాంబుల వ్యవహారంపై మాజీ సీఎం, పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు అమరీందర్​ సింగ్​ స్పందించారు. వాస్తవాలను తోసిపుచ్చడం మానుకుని, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సరిహద్దు వెంబడి ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని, పంజాబ్​ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని అక్కడ భద్రతను పెంచాలని డిమాండ్​ చేశారు.

గతంలోనూ అమరీందర్​ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. అమరీందర్​ అనవసర వ్యాఖ్యలు చేసి ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని డిప్యూటీ సీఎం సుఖ్​జిందర్​ సింగ్​ రంధావా అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.