ETV Bharat / bharat

'కొవిడ్​పై పోరులో వివక్ష.. భాజపా పాలిత రాష్ట్రాలకే టీకాలు'

author img

By

Published : Dec 2, 2021, 3:44 PM IST

COVID-19 management
'కొవిడ్​ నిర్వహణలో వివక్ష.. భాజపా పాలిత ప్రాంతాలకే టీకాలు'

Covid management in India: దేశంలో కరోనా కట్టడిపై లోక్​సభ వేదికగా చర్చ జరిగింది. ప్రధాని మోదీ సర్కారు.. భాజపా పాలిత రాష్ట్రాలకు టీకాలు ఎక్కువగా పంపిణీ చేసి, ఇతర ప్రాంతాలను పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపించాయి. దేశంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకముందే.. 100కోట్ల టీకా పంపిణీ మార్క్​ను ఉత్సవంగా చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి. విపక్షాల ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ఒమిక్రాన్​ భయాలు నెలకొన్న తరుణంలో ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయకూడదని హితవు పలికింది.

Covid crisis in India: లోక్​సభ వేదికగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుపడ్డాయి. దేశంలో కరోనాపై పోరులో మోదీ సర్కారు వివక్ష చూపించిందని మండిపడ్డాయి. భాజపా పాలిత రాష్ట్రాలకు టీకాలు అధికంగా పంపిణీ చేసి, ఇతర ప్రాంతాలను వదిలేసిందని ఆరోపించాయి.

కొవిడ్​ కట్టడిపై గురువారం లోక్​సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. శివసేన ఎంపీ వినాయక్​ రౌత్​ మాట్లాడుతూ.. 'దేశంలోకి కరోనా ప్రవేశించిన 21 నెలల తర్వాత ఈ చర్చ జరగడం దురదృష్టకరం. అది కూడా కేసులు తగ్గిపోయాక చర్చించడం గమనార్హం. కనీసం ఒమిక్రాన్​ విషయంలోనైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నా. ప్రధాని అంటే అందరికీ ప్రధానే. మహారాష్ట్రను చిన్నచూపు చూసి, గుజరాత్​ను నెత్తి మీద పెట్టుకోవడం మంచిది కాదు. ఎన్నికలు వస్తున్నాయని.. అధిక టీకాలను యూపీకి కేటాయించడం సరికాదు. జనాభాను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు ఉండాలి,' అని అన్నారు.

టీకా పంపిణీలో 100కోట్ల మార్క్​ను అందుకున్న అనంతరం భాజపా నేతలు చేసుకున్న సంబరాలపైనా స్పందించారు రౌత్​. దేశంలో ఇప్పటివరకు 38శాతం మందికే పూర్తిస్థాయిలో డోసులు అందినట్టు పేర్కొన్నారు. మరి ఇంత తొందరగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

'రాజకీయాలు చేయకండి..'

దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్​ భయాలు ఉన్నాయని.. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని భాజపా ఎంపీ రతన్​ లాల్​ కటారియా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉన్న పాత్ర గొప్పదని, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్​ సమయంలో భాజపా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ప్రధాని మోదీపై నిందలు వేయడం కొందరు రాజకీయ నేతలకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.

ఆ రాష్ట్రాల్లో..

vaccination top states in India: కాంగ్రెస్​, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. భాజపా పాలిత రాష్ట్రాల్లో (vaccination in bjp ruled state) వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎనిమిది భాజపా పాలిత రాష్ట్రాల్లో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తయింది. అందులో ఏడు రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా మొదటి డోసు పూర్తయింది. అదే కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలో (vaccination in congres ruled states) టీకా ప్రక్రియ ఆశించిన స్థాయిని అందుకోలేదని అధికార వర్గాలు ఇటీవలే తెలిపాయి. బూస్టర్ డోసు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రతిపక్షాలు.. తమ రాష్ట్రాల్లో తగినంతగా వ్యాక్సినేషన్ పంపిణీ చేయలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:- భాజపా పాలిత రాష్ట్రాల్లోనే వేగంగా 'వ్యాక్సినేషన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.