ETV Bharat / bharat

పవర్ ప్లాంట్​ కోసం భూసేకరణ.. పరిహారం కోసం రైతుల పోరు.. పోలీస్ వ్యాన్​కు నిప్పు

author img

By

Published : Jan 11, 2023, 4:32 PM IST

Updated : Jan 11, 2023, 6:11 PM IST

Farmers create ruckus in bihar against police lathicharge
పోలీసుల వ్యాన్​కు నిప్పంటించిన రైతులు

పవర్ ప్లాంట్​ కోసం సేకరిస్తున్న భూమికి సరైన పరిహారం చెల్లించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మహిళలు, పిల్లలపై దాడి చేశారని ఆరోపిస్తూ.. పోలీసు వ్యాన్​కు కర్షకులు నిప్పంటించారు. బిహార్​లోని బక్సర్​లో జరిగిందీ ఘటన.

బిహార్​లోని బక్సర్​లో బుధవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి పోలీసుల వ్యాన్​కు నిప్పంటించారు. అనేక ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. చౌసా పవర్ ప్లాంట్​ కోసం సేకరిస్తున్న తమ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే నిరసనల్లో పాల్గొన్నందుకు మంగళవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి పోలీసులు చొరబడి కొట్టారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బుధవారం ఇలా ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు.

"రైతులు పవర్ ప్లాంట్​ను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆందోళనలు చేస్తున్న గుంపులను చెదరగొట్టేందుకు మా పోలీసులు గాల్లోకి దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపారు" అని బక్సర్​ ఎస్​పీ మనీశ్ కుమార్ చెప్పారు.
భూములకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రైతుల ఇంట్లోకి ప్రవేశించి మహిళలు, పిల్లలపైనా లాఠీచార్జ్ చేశారని.. ఫలితంగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని నిరసనకారులు అంటున్నారు.

పోలీసుల వ్యాన్​కు నిప్పంటించిన రైతులు

థర్మల్ పవర్ ప్లాంట్​ కోసం చౌసాలోని ఎస్​జేవీఎన్ ద్వారా రైతుల భూములను 2010-11 కంటే ముందే సేకరించేందుకు ఒప్పందం చేసుకున్నారు. రైతులకు 2010-11లో ఉన్న భూమి రేట్ల ప్రకారం పరిహారం చెల్లించారు. కంపెనీ 2022లో రైతుల నుంచి భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

"గత రెండు నెలలుగా మేము ప్రస్తుత ధర ప్రకారం భూమికి సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ కంపెనీ మాత్రం పాత రేటు ప్రకారమే పరిహారం చెల్లించి బలవంతంగా మా భూమిని స్వాధీనం చేసుకుంటోంది. మా ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు. మంగళవారం రాత్రి పిల్లల్ని కూడా కొట్టారు. పోలీసులు ఇంత దారుణంగా మాతో ప్రవర్తించటానికి మేమేం తప్పు చేశాం?"
- ఓ రైతు ఆవేదన

Last Updated :Jan 11, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.