బిహార్‌లో కొత్త పొత్తు.. భాజపాకు జేడీయూ గుడ్​బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు

author img

By

Published : Aug 10, 2022, 5:24 AM IST

Bihar Politics

Bihar Politics: బిహార్​ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. అధికార జేడీ(యు).. ఎన్‌డీయే కూటమి నుంచి వైదొలగింది. ఆ కూటమి ప్రభుత్వానికి రాజీనామా చేసిన నీతీశ్‌కుమార్‌ .. వెనువెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహాకూటమి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణం చేయనున్నారు నితీశ్​కుమార్​.

Bihar Politics: విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్‌ ఇస్తున్న భాజపా నాయకత్వానికి బిహార్‌ సీఎం, జేడీ(యు) నేత నీతీశ్‌కుమార్‌ ఝలక్‌ ఇచ్చారు. మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీయే)తో అయిదేళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకున్నారు. తదుపరి కొన్ని నిమిషాల్లోనే మహా కూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలను మిత్రులుగా మార్చుకున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని ఆ కూటమి ప్రభుత్వానికి సారథిగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 8వ సారి బుధవారం మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు.

బిహార్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు మంగళవారం చకచకా జరిగిపోయాయి. భాజపా అగ్రనాయకత్వంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నీతీశ్‌కుమార్‌ ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీయే నుంచి వైదొలగారు. ఆ కూటమి ప్రభుత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌కు తెలిపారు. తర్వాత 164 మంది ఎమ్మెల్యేల జాబితాతో మళ్లీ రాజ్‌భవన్‌కు వచ్చారు. 7 పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సీఎంగా నీతీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేయనున్నారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా కాంగ్రెస్‌...: నీతీశ్‌ మంత్రిమండలిలో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు ప్రాతినిధ్యం లభిస్తుందని సమాచారం. ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని వామపక్షాలు తెలిపాయి. మొత్తం 243 మంది సభ్యులుండే అసెంబ్లీలో ప్రస్తుతం 242 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 122 మంది సభ్యుల మద్దతు అవసరం. గవర్నర్‌కు సమర్పించిన లేఖలో 164 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నట్లు నీతీశ్‌ పేర్కొన్నారు. మద్దతు లేఖలిచ్చిన వారిలో జేడీ(యు)-46 (స్వతంత్ర సభ్యుడితో కలిపి), ఆర్జేడీ-79, కాంగ్రెస్‌-19, సీపీఐ(ఎం.ఎల్‌)-12 సీపీఐ-2, సీపీఎం-2, హిందుస్థాని అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం)-నలుగురు ఎమ్మెల్యేలున్నారు.

నేరుగా రబ్రీదేవి నివాసానికి: రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత నీతీశ్‌ నేరుగా మాజీ ముఖ్యమంత్రి, లాలూప్రసాద్‌ సతీమణి రబ్రీదేవి నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు చేరుకున్నారు. తమ తరఫున నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీయాదవ్‌కు ఇచ్చారు. '2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దామ'ని తేజస్వీతో నీతీశ్‌ అన్నట్లు తెలిసింది. కాసేపటికి నీతీశ్‌, తేజస్వీ కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.

జేడీ(యు) ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ..: ఎన్‌డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడానికి ముందు నీతీశ్‌ పట్నాలోని తన నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు. 'తొలుత చిరాగ్‌ పాస్వాన్‌ తిరుగుబాటు, తర్వాత ఆర్సీపీ సింగ్‌ రూపంలో జేడీ(యు)ను బలహీనపరిచేందుకు భాజపా యత్నించింది. కూటమి నుంచి వైదొలగాల్సిన స్థితిని భాజపానే సృష్టించింద'ని నీతీశ్‌ వారికి వివరించారు. సానుకూలంగా స్పందించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నీతీశ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నట్లు సమాచారం.

వంచనా శిల్పి నీతీశ్‌: ఎన్‌డీయే నుంచి వైదొలగి మహాకూటమితో జట్టు కట్టిన జేడీ(యు)నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌పై భాజపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. పట్నాలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు జేడీ(యు) చేసిన ద్రోహానికి నిరసనగా బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. భాజపా నాయకత్వంపై నీతీశ్‌ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని కమలదళ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ తెలిపారు. ద్రోహ బుద్ధి గల నీతీశ్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన శాస్తి చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు.

భాజపా బెదిరింపు రాజకీయాల ఫలితమే ఇది..: భాజపా నిరంకుశత్వ స్వభావమే ఎన్‌డీయేలో తాజా చీలికకు ప్రధాన కారణమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. కూటమిలోని భాగస్వామ్యపక్షాలకు సహకరించకపోగా బెదిరించడం, కుదిరితే వాటిని కబళించాలనే యత్నాల వల్లే గతంలో అకాలీదళ్‌, శివసేనలు భాజపాకి దూరమయ్యాయని పేర్కొన్నారు. తాజాగా జేడీ(యు) ఉదంతం కూడా అదే కోవలోకి వస్తుందని తెలిపారు.

బిహారీలకు అవమానం: ప్రజల తీర్పుకు నీతీశ్‌ కుమార్‌ మరోసారి వెన్నుపోటు పొడిచారని లోక్‌జనశక్తి అధినేత చిరాగ్‌ పాస్వాన్‌ విమర్శించారు. ప్రజలు గెలిపించిన కూటమిని వీడి మరో కూటమితో జత కట్టడం బిహారీలను అవమానించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

భాజపాతోనే కొనసాగుతాం: తమ పార్టీ భాజపాతోనే కొనసాగుతుందని బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్ర మంత్రి పశుపతి కుమార్‌ పరాస్‌ స్పష్టం చేశారు. ఆయన లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత చిరాగ్‌ పాసవాన్‌కు స్వయాన బాబాయి. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ మద్దతుతోనే పశుపతి కుమార్‌ గతంలో ఎల్‌జేపీని చీల్చి సొంతకుంపటి పెట్టుకున్నారనే విమర్శలున్నాయి.

ఒప్పందం ఏమిటంటే..: ఆర్జేడీ, జేడీ(యు) వర్గాల సమాచారం ప్రకారం.. బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీఎంగా నీతీశే ఉంటారు. ఉపముఖ్యమంత్రి పదవి తేజస్వీయాదవ్‌కు ఇవ్వాలి. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్నది నీతీశ్‌ ఇష్టమే. స్పీకర్‌గా ఆర్జేడీకి చెందిన వ్యక్తే ఉండాలి. కాంగ్రెస్‌కు 4 మంత్రిపదవులిస్తారని సమాచారం. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్‌కు నీతీశ్‌ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి: 'బిహార్​లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వచ్చే ఎన్నికల్లో సున్నా ఓట్లే'

30+ ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్​ నితీశ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.